Telangana: తెలంగాణలో వ్యాపారులు సిండికేట్ గా మారడంతో నష్టపోతున్న పత్తి రైతులు

Telangana: క్వింటాలు రూ.7 వేల నుంచి రూ.8 వేలకే కొనుగోలు

Update: 2022-12-25 04:51 GMT

Telangana: తెలంగాణలో వ్యాపారులు సిండికేట్ గా మారడంతో నష్టపోతున్న పత్తి రైతులు

Telangana: తెలంగాణలో పత్తి వ్యాపారులు సిండికేట్‌గా మారి మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. దీంతో పత్తి రైతులు నష్టపోతున్నారు. వ్యాపారులు సిండికేట్ కావడంతో పత్తి ధర పడిపోతోంది. సీజన్ ప్రారంభంలో క్వింటాలు 10 వేల రూపాయలకు పైగా ధర పలికిన పత్తి ప్రస్తుతం క్వింటాలుకు 2 వేల రూపాయలకు పైగా ధర తగ్గింది. ఇంతకూ పత్తి రైతులను దగా చేస్తున్నదెవరు..? వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ఏం జరుగుతోంది...?

అడ్తి దారులు, ఖరీదు దారులంతా సిండికేట్‌గా మారడంతో పత్తి రైతులు నష్టపోతున్నారు. సీజన్​ప్రారంభంలో క్వింటాలుకు 10 వేల రూపాయలు పెట్టి పత్తి కొన్న వ్యాపారులు.. ఇప్పుడు మార్కెట్‌కు పత్తి ఎక్కువ వస్తుండడంతో ధర బాగా తగ్గించారు. పత్తి ధర క్వింటాలుకు 8 వేల నుంచి 7,500 రూపాయల వరకు పడిపోయింది. జిల్లాలు, మార్కెట్లతో సంబంధం లేకుండా రోజుకు 100 నుంచి 200 రూపాయల ధర తగ్గుతోంది.

ఈసారి విత్తనాలు మొదలుకొని ఎరువుల దాకా అన్నంటి ధర పెరిగి, ఎకరానికి 35 వేల నుంచి 50 వేల రూపాయల దాకా పెట్టుబడి పెట్టారు. భారీ వర్షాలు, వరదలు, చీడపీడల కారణంగా దిగుబడి తగ్గిపోయింది. చేతికొచ్చిన కొద్దిపాటి పంటకైనా మంచి రేటు వస్తుందనుకుంటే వ్యాపారులు ధర తగ్గించి దోపిడీ చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రేట్లు మళ్లీ పెరగకపోతాయా? అని కొందరు ఇండ్లలోనే పత్తి నిల్వ చేసుకుంటుంటే.. ఇంకొందరు అప్పుల బాధ భరించలేక అమ్ముకొని నష్టపోతున్నామంటున్న రైతన్న బాధ ఆయన మాటల్లోనే విందాం...

ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని సర్కార్ అంచనా వేసింది. కానీ క్షేత్రస్థాయిలో దాదాపు 50 లక్షల ఎకరాల వరకే సాగైంది. ఈసారి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా లక్షల ఎకరాల్లో పత్తి చేన్లు జాలువారి దెబ్బతిన్నాయి. వేర్లు కుళ్లిపోవడంతో వివిధ తెగుళ్లు సోకి చెట్లు ఆశించిన స్థాయిలో ఎదగలేదు. కాయ పట్టకపోవడం, పట్టిన కాయ పెరగకపోవడం, రాలిపోవడం లాంటి సమస్యలతో దిగుబడి సగానికి తగ్గిపోయింది. ఎకరాకు కనీసం 14 నుంచి 15 క్వింటాళ్లు రావాల్సిన పత్తి... 7 నుంచి 8 క్వింటాళ్లకు మించి రాలేదంటున్న రైతన్న మాటల్లోనే విందాం.

అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి ఫుల్ డిమాండ్​ఉంది. 165 కిలోలు ఉండే బేల్​ధర రూ.63 వేలకు పైగానే పలుకుతోంది. సాధారణంగా ఒక క్వింటాలు పత్తిలో దాదాపు 34 శాతం పత్తి, 64 శాతం సీడ్, 2 శాతం వేస్టేజీ ఉంటుంది. ఈ లెక్కన క్వింటాలు పత్తిలో 34 కిలోల దూది, 64 కిలోల వరకు పత్తి గింజలు ఉంటాయి. కిలో 381 రూపాయల చొప్పున 34 కిలోల దూదికి దాదాపు 13 వేల రూపాయలు, సీడ్స్ క్వింటాలు 3,700 రూపాయలు ఉంది. వ్యాపారులు మాత్రం అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్​తగ్గుతోందని ప్రచారం చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు.

పత్తికి కనీస మద్దతు ధర 6 వేల 380 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న డిమాండ్ ప్రకారం వరంగల్ ఎనుమాముల మార్కెట్లో వ్యాపారులు సీజన్​మొదట్లో క్వింటాకు 9 వేల నుంచి 10 వేల రూపాయల వరకు చెల్లించారు. అధిక ధర ఉందని రైతులు పెద్ద మొత్తంలో పత్తి తీసుకొస్తుండడంతో వ్యాపారులు దందాకు తెరలేపారు. పత్తి బేల్​ధర స్థిరంగా 63 వేల రూపాయలకు పైగానే పలుకుతున్నా.. ఇక్కడి వ్యాపారులు మాత్రం రోజురోజుకు ధర తగ్గిస్తూ... రైతులను దగా చేస్తున్నారు. సగటున 7 వేల రూపాయల లోపే అందుతోందంటున్నారు రైతులు.

దుక్కులు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు కలిపి ఎకరానికి 35 వేల నుంచి 50 వేల రూపాయల దాకా పెట్టుబడి పెట్టారు. నిరుడు ఓ దశలో వ్యాపారులు క్వింటాలు​పత్తికి 14 వేల రూపాయల దాకా పెట్టి కొన్నారు. ఈసారి కూడా అదే రేటు ఇస్తే కనీసం పెట్టుబడులు మీదపడకుండా ఉంటాయని రైతులు ఆశించారు. ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని ఆశిద్దాం.

Tags:    

Similar News