శ్రీరామనవమి వేడుకలపై కరోనా ప్రభావం..

ప్రతి ఏడాది భక్తుల రామనామస్మరణల మధ్య నిర్వహించే శ్రీరామనవమి వేడుకలు ఈ సారి వెలవెల బోనున్నాయి.

Update: 2020-03-17 08:50 GMT
Corona Effect on Sriramanavami Celebrations in Bhadrachalam Temple

ప్రతి ఏడాది భక్తుల రామనామస్మరణల మధ్య నిర్వహించే శ్రీరామనవమి వేడుకలు ఈ సారి వెలవెల బోనున్నాయి. భద్రాచంలో ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించే శ్రీరామనవమి వేడుకలను కొద్ది మంది భక్తుల మధ్య నిర్వహించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ తెలిపారు. గత నెలలో భద్రాద్రి కళ్యాణం, ఆర్జిత సేవల టికెట్లను ఆన్‌లైన్‌లో ఆలయ కమిటీ విక్రయించగా ఇప్పుడు ఆ టికెట్లను రద్దు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఎవరి టికెట్ అయితే రద్దవుతుందో వారి డబ్బును ఆలయ అధికారులు తిరిగి వారికి చెల్లిస్తారని ఆయన తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నవమి వేడుకలను ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఇక ఈ కరోనా ప్రభావంతో ఇప్పటికే పలు ఆలయాలు మూసివేస్తున్నారు. మరికొన్ని ఆలయాలలో భక్తుల రద్దీ పెరగకుండా శీఘ్రదర్శనం చేయించి పంపిస్తున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు భయాందోళలనకుగురి కావొద్దని చెబుతున్నారు. ప్రజలు అన్నిజాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని మంత్రి తెలిపారు.

ఇక పోతే దేశంలో ఈ ఒక్క రోజే 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా భాదితుల సంఖ్య 128కు చేరింది. ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కాగా ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే కర్ణాటకలో ఓ వృద్ధుడు, ఢిల్లీలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News