నిన్న చార్మినార్ యునాని ఆస్పత్రి వద్ద జూనియర్ డాక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పరమేష్ సస్పెండ్ అయ్యాడు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన సీపీ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని సౌత్ జోన్ డీసీపీని ఆదేశించారు. చార్మినార్ నుంచి ఆయుర్వేద ఆస్పత్రిని తరలించవద్దంటూ వైద్య విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. దీంతో విద్యార్థులను బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించే క్రమంలో అక్కడ మఫ్టీలో ఉన్న ఓ పోలీసు ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె కాళ్లను తొక్కి, గోళ్లతో గట్టిగా గిచ్చాడు. ఆ బాధ భరించలేని సదరు విద్యార్థిని గట్టిగా అరిచి కేకలు వేసింది. కానిస్టేబుల్ విద్యార్థినిని గిచ్చుతున్నప్పుడు అక్కడున్న విద్యార్థులు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తక్షణమే ఆ కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ ఘటన తీవ్ర వివాదాస్పదం కావడంతో అధికారులు ఆ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు.