Revanth Reddy: కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో సీఎం రేవంత్ భేటీ
Revanth Reddy: రూ.4,256 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరిన రేవంత్
Revanth Reddy: కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో సీఎం రేవంత్ భేటీ
Revanth Reddy: ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బిజీ బిజీగా గడుపుతున్నారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్, విజయవాడ వయా మిర్యాలగూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కోరారు. హైదరాబాద్-నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందించారు.
యూపీఏ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్కు నేషనల్ డిజైన్ సెంటర్ మంజూరు చేసిందని, నాటి కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ దానికి శంకుస్థాపన చేశారని.. సీఎం గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత నేషనల్ డిజైన్ సెంటర్ను విజయవాడకు తరలించారని, ఈ నేపథ్యంలో తెలంగాణకు కొత్త ఎన్ఐడీ మంజూరు చేయాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు మెగా లెదర్ పార్క్ మంజూరు చేసిందని... తెలంగాణకు కొత్తగా కరీంనగర్, జనగాం జిల్లాల్లో లెదర్ పార్క్ ఏర్పాటుకు అవసరమైన భూములున్నాయని, కేంద్ర ప్రభుత్వం మెగా లెదర్ పార్క్ మంజూరు చేస్తే వెంటనే భూమి కేటాయిస్తామని కేంద్ర మంత్రి పియూష్ గోయల్కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.