బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శాసనసభలో ఆదివారం ప్రసంగించారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన యురేనియం తవ్వకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేశారు. పర్యావరణానికి హాని కలిగించే యురేనియం తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. యురేనియం తవ్వకాల గురించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎవ్వరికీ ఏ విధమైన అనుమతి ఇవ్వలేదని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. భవిష్యత్లో అనుమతి ఇచ్చే ఆలోచన కూడాలేదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నల్లమల అడవులను నాశనం కానివ్వం. అనుమతులు ఇవ్వొద్దని చెబితే కూడా గతంలో అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుమతులు మంజూరు చేశారన్నారు. యురేనియం తవ్వకాలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు సభలో సోమవారం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. కేంద్రం వినకపోతే కలిసి ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు.