Temperature: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. వేడిని తట్టుకోలేక ఇళ్లకే పరిమితమవుతున్న ప్రజలు
Temperature:తెలంగాణ రాష్ట్రానికి వడగాలుల హెచ్చరిక
Temperature: తెలుగు రాష్ట్రాలలో సూరీడు సుర్రుమంటున్నాడు. వేడిక్కిన ఆదిత్యుని తాపానికి జనం విలవిలలాడుతున్నారు. బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు పగటిపూట వడగాలులు వీచే పరిస్థితులు ఉన్నట్లు ప్రకటించింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ను తాకింది. రాత్రుళ్లు కూడా సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలో 16 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఏడాది మొదటిసారి వడగాలులు నల్గొండ జిల్లాలో నమోదయ్యాయి. నిన్న వేములపల్లి మండలంలో 42.7 డిగ్రీలు, నిడమనూరు మండలంలో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొద్ది రోజులుగా ఇక్కడ వడగాలులు వీస్తున్నట్లు గుర్తించారు. నిన్న ఖమ్మంలో సాధారణం కన్నా 4.2 డిగ్రీలు అధికంగా 40.4 డిగ్రీలు నమోదయ్యాయి.