BRS: లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. నేటి నుంచి సమావేశాలు
BRS: ఎంపీ స్థానాల వారీగా భేటీలు
BRS: లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. నేటి నుంచి సమావేశాలు
BRS: లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి లోక్సభ నియోజకవర్గాల వారీగా నేటి నుంచి సన్నాహాక సమావేశాలు జరుపనున్నారు. ఈనెల 21 వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ జనరల్ సెక్రటరీ కేశవరావు, పార్టీ నేతలు హరీశ్రావు, కడియం శ్రీహరి, జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మధుసూధనాచారి, పోచారం శ్రీనివాస్రెడ్డి తదితర ముఖ్య నేతలు సమావేశాలు నిర్వహించనున్నారు. మొదటి విడత సమావేశాలు నేటి నుంచి 12 వరకు జరుగుతాయి.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో మూడురోజుల విరామమిస్తారు. తిరిగి జనవరి 16 నుంచి మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగిస్తారు. ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఒక లోక్సభ నియోజకవర్గం నాయకులతో సమావేశమై, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. మీటింగ్కు హాజరయ్యే ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని కార్యాచరణను రూపొందిస్తారు.
అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సమావేశాలకు ఆయా లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలందరినీ ఆహ్వానించారు. ఎంపీలు, నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సమావేశాలకు హాజరుకానున్నారు.