సినీ నటుడు, నిర్మాత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండ్ల గణేష్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ఆ పార్టీలో చేరిన ఆయన.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగతకారణాల రీత్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని బండ్ల గణేష్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్విట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా తాను చేసిన విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టినవారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నా అని వేడుకున్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఐఏసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదని.. కేవలం సినీప్రముఖుడిని మాత్రమే అని బండ్ల గణేష్ చెప్పారు. కాగా గడిచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే తాను పీక కోసుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.