Bandi Sanjay Controversial Comments : ఎవరైనా వేలెత్తి చూపిస్తే చేయి నరికేస్తా : బండి సంజయ్

Update: 2020-09-08 11:03 GMT

బండి సంజయ్ ఫైల్ ఫోటో

Bandi Sanjay Controversial Comments : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు బీజేపీతోనే మంచి జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో బీజేపీ మద్దతుదారులు, హిందువులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ వారిని ఎప్పటికప్పుడు కాపాడుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని అల్వాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎవరైనా వారిపై వేలెత్తి చూపించాలని ప్రయత్నిస్తే వారి చేయి నరికేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

కరోనా వేళ ప్రజా సమస్యలు పరిష్కరించే అంశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. అధికార పార్టీ వర్గాలు బీజేపీ నేతలపై అనవసర కేసులు పెట్టి వేధింపులకు గురి చేయాలని చూస్తోందని ఆరోపించారు. కింది స్థాయిలోని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సైతం బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. ప్రజలకు బీజేపీతోనే న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. బీజేపీ నాయకులెవరూ అధికార పార్టీ మోపే కేసులకు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రానున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో బీజేపీ అధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో చూస్తే కరోనా అంశంలో ప్రజల్లో తీవ్ర అభద్రతా భావం నెలకొని ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రాణాలు రక్షించడం తక్షణ అవసరం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలపై సిబ్బందే ధర్నాలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజల్లో విశ్వాసం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కరోనా కేసుల విశయాలపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ పనితీరును అధికారుల నిర్లక్ష్యాన్ని, ఆస్సత్రుల్లో కల్పిస్తున్న సౌకర్యాల విషయంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచింది. న్యాయస్థానం ప్రజల ప్రాణాలను, ఆరోగ్యాన్నికాపాడాలని ప్రభుత్వాన్ని కోరే పరిస్థితి ప్రస్తుతం దాపురించిందన్నారు.  

Tags:    

Similar News