Hyderabad Metro: బెంగళూరు మెట్రోరైలు ఛార్జీలను అక్కడి ప్రభుత్వం 50శాతం వరకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోనూ పెంచే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై అంతర్గతంగా కసరత్తు చేస్తోంది. ఏడేళ్ల క్రితం నిర్ణయించిన ధరలే ప్రస్తుతం ఉన్నాయని ప్రయాణికుల డిమాండ్ కు తగ్గట్లుగా కొత్త కోచ్ లు కొనుగోలు చేసేందుకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆర్థికంగా ఆదుకోవాలని సదరు సంస్థ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇప్పుడున్న 57 మెట్రో రైళ్లు మూడు మార్గాల్లో చాలడం లేదు. అదనంగా మరో 10 రైళ్లు అయినా అవసరమని మెట్రో వర్గాలు అంచనా వేస్తున్నాయి. తీవ్ర నష్టాల్లో ఉన్నామని..సర్కార్ ఆర్థికంగా తోడ్పాటు ఇచ్చే కొత్త కోచ్ లు కొంటామని తెలిపింది. దీంతో ఛార్జీల సవరణ అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది.
మెట్రో రైలు సేవలు మొదలై ఐదు సంవత్సరాలు పూర్తయిన సమయంలో ఛార్జీలు పెంచాలని రెండేళ్ల క్రితం ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీన్నికేంద్రానికి నివేదించిగా అప్పుడు ఓ కమిటీని వేశారు. సదరు సంస్థ ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. ఎన్నికల ముందు కావడంతో అప్పటి ప్రభుత్వం పెంపు ప్రతిపాదనలను తిరస్కరించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడం, బెంగళూరులో ఛార్జీలు పెంపు తాజాగా అమల్లోకి రావడంతో హైదరాబాద్ మెట్రోలోనూ ఛార్జీల సవరణ అంశంపై చర్చ షురూ అయ్యింది. తాజా పెంపు ప్రతిపాదనలతో రావాలనే సంకేతాలను హెచ్ఎంఆర్ ఇది వరకే ఎల్ అండ్ టీకి ఇచ్చింది.