హైదరాబాద్లో దారుణం : రూ.35వేల బాకీ కోసం కత్తితో దాడి
హైదరాబాద్లో దారుణం జరిగింది. రూ.35వేల బాకీని తీర్చనందుకు గాను కొందరు దుండగులు ఓ వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడ్డారు.
హైదరాబాద్లో దారుణం జరిగింది. రూ.35వేల బాకీని తీర్చనందుకు గాను కొందరు దుండగులు ఓ వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నిన్న (శనివారం) చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన కలకలం రేపింది.
ఇక వివరాల్లోకి వెళ్తే రాజేంద్రనగర్ లోని శాస్త్రిపురం కింగ్స్ కాలనీలో నివసించే మిర్జా ముబీనుద్దీన్(32)కు భవానీనగర్కు చెందిన ఎం.ఎ.రెహ్మాన్ అలియాస్ రెహ్మాన్ తో పరిచయం ఉంది. వాహనం కొనుగోలు విషయంలో మిర్జా ముబీనుద్దీన్ రూ.35 వేలు రెహ్మాన్కు బాకీ పడ్డాడు. బాకీ విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి... ఈ క్రమంలో శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రెహ్మాన్ మిర్జాకి ఫోన్ చేసి మద్యం సేవించేందుకు పిలిచాడు.
ఈ క్రమంలో మిర్జా ముబీనుద్దీన్ వద్దకు రెహ్మాన్, కొందరు వ్యక్తులు రెండు బైక్లపై వచ్చారు. బాకీ విషయమై మిర్జా,రెహ్మాన్లకి మధ్య ఘర్షణ మొదలైంది. రెహ్మాన్, మిగిలి ఇద్దరు మిర్జాపై దాడి చేశారు. ఈ క్రమంలో మిర్జా తప్పించుకోని పరిగెత్తుతూ ఉండగా అతడిని నడిరోడ్డుపై పరుగెత్తిస్తూ కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ క్రమంలో గొంతు కోసేందుకు యత్నించగా మిర్జా వారిని నెట్టేశాడు. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో నిందితులు పరారయ్యారు.. విషయాన్నీ తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. భాదితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.