ప్రసవం సమయంలో నేను ఆపరేషన్ థియేటర్లో లేను.. చేయని తప్పుకు నన్ను బలి చేశారు..
అచ్చంపేట ప్రభుత్వాసుపత్రి ప్రసవం ఘటనలో మరో కోణం వెలుగు చూసింది. శిశువు మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని డ్యూటి డాక్టర్ సుధారాణి అంటున్నారు. శిశివు మృతికి ఆసుపత్రి సూపరింటెండెంట్ తారాసింగ్, మరో వైద్యుడు సిరాజ్ ఘటనకు కారణమని ఆరోపించారు. ఆ ఘటనలో ప్రమేయం లేకున్నా అధికారులు తనపై చర్యలు తీసుకున్నారని వైద్యురాలు సుధారాణి ఆరోపించారు. సోమవారం ఆమె తల్లిదండ్రులతో కలిసి అచ్చంపేట ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. 'బాధిత మహిళ స్వాతి ఆసుపత్రికి వచ్చిన రోజు ఓపీలో ఉన్నా. ఆమెకు ప్రసవం చేస్తున్న విషయమే తెలియదు. సూపరింటెండెంట్ తారాసింగ్, మరో వైద్యుడు సిరాజ్ ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు. తల, మొండెం వేరైన విషయాన్నీ వాళ్లు చెప్పలేదు. డ్యూటీ వైద్యురాలైన నాకు చెప్పకుండానే సిరాజ్ పెద్దాస్పత్రికి రెఫర్ చేశారు. బాధిత కుటుంబానికి సమాధానం చెప్పాలంటూ సూపరింటెండెంట్ సూచించడంతో వారికి సంజాయిషీ ఇచ్చా. తప్పును కప్పిపుచ్చుకునేందుకు సీనియర్లు నన్ను బలి పశువును చేశారు'' అని ఆమె పేర్కొన్నారు. చేయని తప్పుకు తనను బలి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆమె అకారణంగా విధుల నుంచి తొలగించారంటూ కన్నీరు పెట్టుకున్నారు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయిస్తానంటూ సుధారాణి ప్రకటించారు.