హైదరాబాద్ : ప్రముఖ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు ఐ.వెంకట్రావు రాసిన ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని తన నివాసంలో ఆదివారం ఆవిష్కరించారు. 'విలీనం -విభజన' పేరిట ఎన్.అనురాధ తెలుగులోకి అనువదించిన పుస్తకాన్ని కూడా సీఎం విడుదల చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విలీనం, విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలను పాలించిన 22 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలాన్ని కూడా ఈ పుస్తకంలో వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమైన పలు రాజకీయ సంఘటనలు ఇందులో ప్రస్తావించారు.
ఈ రెండు పుస్తకాలను ఆవిష్కరించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పరిశోధకులకు, భవిష్యత్ తరాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. చారిత్రక అంశాలతో కూడిన ఇలాంటి పుస్తకాలు సమాజానికి ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. పుస్తకాన్ని చక్కగా తెలుగులోకి అనువదించిన అనురాధను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రచయిత వెంకట్రావుతోపాటు రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి కె.చంద్రహాస్, పబ్లిషర్లు ఐ.వేణు, ఐ.రఘు కూడా పాల్గొన్నారు.