ఇద్దరు యువకులు సరదాగా నీటిలోకి దిగారు. ఈత కొడుతున్నారు. అంతటితో ఆగకుండా టిక్టాక్ వీడియో తీసేందుకు ప్రయత్నించారు. చివరికి ఆ సరదా కాస్తా.. ప్రాణాల మీదకు తెచ్చింది. చివరికి నీటిలో ఊపిరాడక ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివార్లలోని ఓ చెరువులో జరిగింది.
సంగారెడ్డికి చెందిన యువకుడు నర్సింహ, అతనికి వరుసకు ప్రశాంత్.. ఇద్దరూ కలిసి దూలపల్లి దుమార్ చెరువులో దిగారు. సరదాగా ఇద్దరు కలిసి జలకాలాడుతున్నారు. ఆపై నీళ్లలోనే టిక్టాక్ వీడియో తీసేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఈత రాక నర్సింహ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. దీంతో భయపడిన ప్రశాంత్.. స్థానికులకు సమాచారమిచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని బయటికి తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.