Sehwag vs Kohli: మొన్న కోపాలు... నేడు పొగడ్తలు

Sehwag vs Kohli: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌటైయ్యాడు.

Update: 2021-03-16 12:52 GMT

వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ

Sehwag vs Kohli: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌటైయ్యాడు. ఇక రెండో మ్యాచ్‌లో మాత్రం బ్యాట్ ఝులిపించి విన్నింగ్‌ ఇన్నింగ్స్‌(49 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు‌) తో ఫాం లోకి వచ్చాడు. ఈ ఇన్సింగ్స్ పై భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు‌. తొలి టీ20 తుది జట్టు ఎంపిక, రోహిత్‌కు విశ్రాంతినివ్వడంలాంటి విషయాలపై కోహ్లీ పై విరుచుకుపడిన సెహ్వాగ్... రెండో టీ20లో కోహ్లి ఇన్నింగ్స్‌ను ఆకాశానికెత్తేశాడు. మ్యాచ్‌ను ముగించడంలో కోహ్లి.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌తో సరిసమానమని కొనియాడాడు. ఈ విషయంలో యువ క్రికెటర్లు రిషబ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌లు కోహ్లిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించాడు.

అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇషాన్‌ కిషన్‌(32 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అదరగొట్టే ఇన్సింగ్స్ ఆడాడని, కానీ.. కోహ్లిలా ఆఖరి దాకా క్రీజ్‌లో ఉండేందుకు ఆసక్తి చూపలేదన్నాడు. ఈ విషయంలో కిషన్, కోహ్లీ సలహాలు తీసుకోవాలని సూచించాడు. ఇక మరో యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ (13 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) సైతం వేగంగా రన్స్ రాబట్టేందుకు చూశాడే కానీ, కోహ్లిలా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడన్నాడు.

ఇటీవల కాలంలో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కోహ్లికి తాజా ఇన్నింగ్స్‌ భారీ ఊరట కలిగించిందని సెహ్వాగ్‌ అన్నాడు. కాగా, ఇంగ్లండ్‌తో ముగిసిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 1-1తో సిరిస్‌ను సమం చేసింది. ఇంగ్లాండ్ vs ఇండియాల మధ్య మూడో మ్యాచ్‌ ఇదే వేదికగా ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది. 

Tags:    

Similar News