SRH vs KKR: ముందు గెలవండి.. తర్వాత 300 గురించి ఆలోచించండి.. నమ్మకం పెట్టుకుంటే నదిలో తోశారు కద భయ్యా!
టార్గెట్ 300 అనే నినాదంపై కూడా SRH ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. ముందు మ్యాచ్లు గెలవడం నేర్చుకోవాలని.. తర్వాత అతిగా టార్గెట్లు పెట్టుకోవచ్చని చురకలంటిస్తున్నారు.
SRH vs KKR: ముందు గెలవండి.. తర్వాత 300 గురించి ఆలోచించండి.. నమ్మకం పెట్టుకుంటే నదిలో తోశారు కద భయ్యా!
SRH vs KKR: ఇంకోసారి 300 అంటే మూతి మీద కొట్టేలా ఉన్నారు. 200 టార్గెట్ను ఛేజ్ చేయలేకపోతున్న సన్రైజర్స్.. సీజన్కు ముందు మాత్రం బడాయి పోయింది. ప్రతీ మ్యాచ్లోనూ 300 పరుగులే టార్గెట్ అని ధీమా వ్యక్తం చేసింది. ఓవైపు వికెట్లు పడుతుంటే జాగ్రత్తగా ఆడాల్సిన బ్యాటర్లు నిర్లక్ష్య షాట్లకు వెళ్లి పెవిలియన్ చేరుతున్నారు. ఇది నిజంగా ప్రొఫెషనల్ క్రికెట్ కాదేమో అనిపించేలా సన్రైజర్స్ బ్యాటర్ల తీరు కొనసాగుతోంది. ఇదే ఈడెన్ గార్డెన్స్లోనూ కనిపించింది. కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో 80 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఓటమితో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్కు అది పెద్ద బూమరాంగ్గా మారింది. కెప్టెన్ కమిన్స్ తీసుకున్న ఈ నిర్ణయం చివర్లో బాగా తిప్పలు పెట్టింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో బౌలింగ్ విభాగం పూర్తిగా చేతులెత్తేసింది. కమిన్స్ స్వయంగా కూడా తక్కువ నిపుణత్వంతో కనపడ్డాడు. తన క్వాటాలో నాలుగు ఓవర్లు వేయడం, అందులో ఒక్క వికెట్ మాత్రమే తీసుకుని 44 పరుగులు సమర్పించుకోవడం మ్యాచ్ను పూర్తిగా వదిలేయడమే అన్నట్టైంది. హర్షల్ పటేల్ పరిస్థితి కూడా పెద్దగా భిన్నంగా లేదు. అతను కూడా నాలుగు ఓవర్లలో 43 పరుగులిచ్చాడు. ఈ రకంగా చూస్తే బౌలింగ్ విభాగమే భారీ పరాజయానికి దారితీసింది.
ఇక బ్యాటింగ్ పరంగా బలంగా కనిపించిన ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మరోసారి తడబడ్డారు. ఒకే ఒక్క మ్యాచ్లో గొప్పగా ఆడినప్పటికీ మిగతా మ్యాచ్ల్లో మాత్రం ఇలాంటి ఆటతీరు కనబర్చలేకపోతున్నారు. విరుచుకుపడే స్టైల్లో ఆరంభించాల్సినవారు ఇప్పుడైతే వరుసగా నిరుత్సాహపరిచే ప్రదర్శనలతో జట్టుకు మేలు చేసే స్థాయిలో లేరు. ఇషాన్ కిషన్ తొలి మ్యాచ్లో సెంచరీతో అద్భుతంగా స్టార్ట్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత పూర్తిగా ముస్లిపోయాడు. బ్యాట్ నుంచి పరుగులు రావడం మానిపోయింది. సెంచరీ తర్వాత వచ్చిన అన్ని ఇన్నింగ్స్ల్లోనూ విఫలమవుతూ, అంచనాలను తలకిందలు చేశాడు. అప్పటిదాకా అతనిపై పెట్టుకున్న నమ్మకం, ఇప్పుడు జట్టులో భారంగా మారుతోంది.
ఇక టీమిండియాలో అవకాశం దక్కించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి కూడా 2025 ఐపీఎల్ సీజన్లో తన స్థాయిని చూపలేకపోతున్నాడు. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో పూర్తిగా ఫెయిల్ కావడం అతని ప్రాధాన్యాన్ని తగ్గించింది. మిడిల్ ఆర్డర్ను నిలబెట్టే బాధ్యత అతనిపై ఉన్నా, ఎప్పటికప్పుడు నిరాశపర్చడమే జరగుతోంది. మొత్తంగా చూస్తే, బ్యాటింగ్ నుంచి బౌలింగ్ వరకు ప్రతిభ కనబర్చాల్సిన కీలక ఆటగాళ్లు తలదించుకునే రీతిలో ఆడినప్పుడు, ఓటమికి మరో కారణం అవసరం లేదు.