Sania Mirza: ఆర్సీబీ మహిళా జట్టుకు మెంటార్‌గా సానియా మీర్జా

Sania Mirza: ఆర్సీబీ మహిళా జట్టుతో కలవడం సంతోషంగా ఉంది

Update: 2023-02-15 11:06 GMT

Sania Mirza: ఆర్సీబీ మహిళా జట్టుకు మెంటార్‌గా సానియా మీర్జా

Sania Mirza: ఉమెన్ ప్రీమియర్‌ లీగ్‌ తొలి టోర్నీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల వేలం, ప్రసార హక్కుల బిడ్‌లు అన్నీ ముగిశాయి. ఇక మార్చి 4వ తేదీ నుంచి పోటీల సందడి మొదలు కానుంది. ఈ క్రమంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకొంది. తమ మహిళల జట్టుకు మెంటార్‌గా భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జాను నియమించింది. ఈ మేరకు ఆర్‌సీబీ తన ట్విటర్‌ ఖాతాలో ప్రకటించింది.

సానియాను మెంటార్‌గా నియమించడంపై ఆర్‌సీబీ హెడ్‌, వైస్‌ ప్రెసిడెంట్ రాజేశ్‌ వి మేనన్‌ స్పందించారు. ఆర్‌సీబీ మహిళా జట్టుకు సానియా మీర్జాను మెంటార్‌గా నియమించడం గర్వంగానూ, ఆనందంగానూ ఉందన్నారు. కష్టపడేతత్వంతో ఉన్నత శిఖరాలకు ఎదిగిన ఆమెను సరైన వ్యక్తిగా భావించామని తెలిపారు. కఠిన పరిస్థితుల్లో ఎలా రాణించాలనే విషయాలను యువ క్రికెటర్లకు మార్గనిర్దేశం చేయగలదన్నారు. అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన సానియా మీర్జా తప్పకుండా జట్టును ఉత్తమ పద్ధతిలో నడిపిస్తుందనే నమ్మకం ఉందన్నారు.

ఆర్‌సీబీకి మెంటార్‌గా నియమించడంపై సానియా మీర్జా ఆనందం వ్యక్తం చేసింది. ఆర్‌సీబీ మహిళా జట్టుతో కలవడం సంతోషంగా ఉందని... ఉమెన్ ప్రీమియర్‌ లీగ్‌తో మహిళల క్రికెట్‌ ఉన్నత శిఖరాలకు చేరడం ఖాయమన్నారు. మెంటార్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఉత్సాహంతో ఉన్నట్లు సానియా తెలిపారు. ఇటీవలే సానియా తన ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికింది.

Tags:    

Similar News