India vs New Zealand,1st Test Day 2: కేన్ కెప్టెన్ ఇన్నింగ్స్..ఆధిపత్యం కివీస్దే
వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాపై న్యూజిలాండ్ ఆధిపత్యం సాధిస్తోంది.
వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాపై న్యూజిలాండ్ ఆధిపత్యం సాధిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 51 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 165పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. టీమిండియా బ్యాట్స్మెన్ గ్రీన్ పిచ్పై చేతులెత్తేస్తే, కివీస్ ఆటగాళ్లు మాత్రం మెరుపులు మెరిపించారు. రెండో రోజు కివీస్ తొలి ఇన్నింగ్స్ ఐదు వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (89 పరుగులు, 153 బంతుల్లో; 11×4) , కెరీర్ వందో టెస్టు ఆడుతున్న రాస్ టేలర్ (44 పరుగులు, 71 బంతుల్లో; 6 ఫోర్లు, 1సిక్సు)తో రాణించారు. ఆట ముగిసేసమయానికి వాట్లింగ్ (14*, 29 బంతుల్లో; 1×4), గ్రాండ్హోమ్ (4 పరుగులు, 2 బంతుల్లో; 1×4)తో క్రీజులో ఉన్నారు. ఒక్క ఇషాంత్ శర్మ 31పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. షమీ, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.
కివీస్ ఓపెనర్ టామ్ లాథమ్ (11)ను ఆదిలోనే ఇషాంత్ శర్మ పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ టామ్ బ్లండెల్ (30)తో కలిసి కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అయితే, ఇషాంత్ బ్లండెల్ను క్లీన్బౌల్డ్ చేయడంతో 46 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ దశలో బ్యాటింగ్కు రాస్ టేలర్తో కలిసి కేన్ విలియమ్సన్ టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరూ సమన్వయంతో ఆడారు. ఈ క్రమంలో కేన్ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత ఇషాంత్ వీరి జోడికి బ్రేక్ వేశాడు. బౌన్స్ వేసి టేలర్ను బోల్తా కొట్టించాడు. దీంతో 93 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత విలియమ్సన్న(89) షమి, నికోల్స్ను (17) అశ్విన్ ఔట్ చేశారు. దీంతో కెప్టెన్ ఇన్నింగ్స్కు తెరపడింది.
అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 122/5తో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా గంటలోపే చాపచూట్టేసింది. రెండో రోజు ఆటలో భారత్ మరో 43 పరుగులే జోడించి చివరి అయిదు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు బరిలోకి దిగిన కొద్దిసేపటికే భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. రహానె (46), పంత్ (19) మధ్య సమన్వయం లోపించడంతో పంత్ రనౌటయ్యాడు. ఆదిలోనే వికెట్ పంత్ వికెట్ కోల్పోవడంతో కష్టాల్లో పడింది. అజాజ్ పటేల్ వేసిన త్రోబాల్ నేరుగా వికెట్లకు తాకడంతో పంత్ ఔటైయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అశ్విన్ సౌథీ బౌలింగ్లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత రహానె, ఇషాంత్ శర్మ (5) కూడా పెవిలియన్ చేరారు. అయితే చివరల్లో మహ్మద్ షమీ (20) బ్యాటు ఝళిపించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 165 పరుగులు చేయగలిగింది. కివీస్ బౌలర్లో జేమీసన్ 39 పరుగులకే నాలుగు వికెట్లు, టిమ్ సౌథీ నాలుగు వికెట్లు తీసి భారత బ్యాట్స్మెన్ వెన్నువిరిచారు.
Shami strikes! Williamson has to go for an expertly crafted 89. Slicing a catch to Jadeja at cover. Watling joins Nicholls with the lead at 20 runs. LIVE scoring | https://t.co/vWdNIMMIwd #NZvIND pic.twitter.com/CPEIHaNZZr
— BLACKCAPS (@BLACKCAPS) February 22, 2020