Lords Test : 387పరుగులకు టీమిండియా ఆలౌట్.. ఉత్కంఠగా మారిన మ్యాచ్
Lords Test : లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో భారత జట్టు లీడ్ సాధించే అవకాశాన్ని కోల్పోయింది.
Lords Test : 387పరుగులకు టీమిండియా ఆలౌట్.. ఉత్కంఠగా మారిన మ్యాచ్
Lords Test : లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో భారత జట్టు లీడ్ సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 387 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత జట్టు కూడా సరిగ్గా అన్నే పరుగులకే అంటే 387 రన్స్కే మొదటి ఇన్నింగ్స్ను ముగించింది. దీంతో రెండు జట్ల స్కోర్లు మొదటి ఇన్నింగ్స్లో సమానమయ్యాయి. ఇండియా తరపున కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టగా, రిషభ్ పంత్ , రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలు చేశారు. అయినా కూడా, భారత జట్టు లీడ్ సాధించలేకపోయింది. చివరి 11 పరుగుల తేడాలో నాలుగు వికెట్లు కోల్పోవడం వల్ల లీడ్ దక్కలేదు. ఇక రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్, మూడో రోజు ఆట ముగిసేసరికి ఎలాంటి వికెట్ కోల్పోకుండా 2 పరుగులు చేసింది.
భారత జట్టు మూడో రోజు ఆటను మూడు వికెట్లకు 145 పరుగులతో ప్రారంభించింది. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ ఇండియా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. ఆట మొదలైన వెంటనే రాహుల్, పంత్ అద్భుతంగా ఆడారు. ఈ సమయంలో పంత్ హాఫ్ సెంచరీ కొట్టాడు. కానీ రనౌట్ అయ్యి పెవిలియన్కు తిరిగి వచ్చాడు. పంత్ 112 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 74 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పంత్, కేఎల్ రాహుల్ మధ్య నాల్గవ వికెట్కు 141 పరుగుల భాగస్వామ్యం ఉంది. పంత్ అవుట్ అయిన వెంటనే లంచ్ బ్రేక్ ప్రకటించారు. మొదటి సెషన్లో భారత జట్టు 103 పరుగులు చేసి కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది.
లంచ్ బ్రేక్ తర్వాత, రాహుల్ తన 10వ టెస్ట్ సెంచరీని పూర్తి చేశాడు. అయితే, సెంచరీ కొట్టిన వెంటనే రాహుల్ తన వికెట్ను కోల్పోయాడు. చివరికి రాహుల్ 177 బంతుల్లో 13 ఫోర్ల సహాయంతో 100 పరుగులు చేశాడు. దీని తర్వాత రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి బాధ్యతాయుతమైన బ్యాటింగ్ను కొనసాగించారు. ఇద్దరు బ్యాట్స్మెన్లు మంచి భాగస్వామ్యం నెలకొల్పి జట్టును 300 పరుగుల మార్కు దాటించారు. కానీ బెన్ స్టోక్స్ నితీష్ రెడ్డిని అవుట్ చేసి ఇండియాను మరో దెబ్బ కొట్టాడు. నితీష్, జడేజా మధ్య 72 పరుగుల భాగస్వామ్యం ఉంది.
నితీష్ అవుట్ అయిన తర్వాత కూడా తన ఆటను కొనసాగించిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ కొట్టాడు. జడేజా 87 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ టూర్లో జడేజాకు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ. జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్ భారత స్కోర్ను 350 పరుగుల మార్కు దాటించింది. అయితే, రవీంద్ర 131 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 72 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అవుట్ కావడానికి ముందు, జడేజా వాషింగ్టన్ సుందర్తో కలిసి 50 పరుగుల పార్టనర్ షిప్ అందించాడు.
జడేజా అవుట్ అయినప్పుడు, భారత స్కోర్ 376 పరుగులు. అంటే, భారత జట్టు లీడ్ సాధించడానికి కేవలం 12 పరుగుల దూరంలో ఉంది. కానీ, భారత్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో లీడ్ సాధించలేకపోయింది. ఇండియా తరపున నితీష్ 30, వాషింగ్టన్ సుందర్ 23, ఆకాష్ దీప్ ఏడు పరుగులు చేయగా, బుమ్రా రుగులు చేయలేకపోయాడు. సిరాజ్ కూడా పరుగులు చేయకుండా నాటౌట్గా నిలిచాడు.