Rishabh Pant: టీ20ల్లో రిషభ్ ఖచ్చితంగా మ్యాచ్ విన్నరే: లక్ష్మణ్

Rishabh Pant: రిషభ్ పంత్ టీ20 ల్లో భారత్‌కు మ్యాచ్ విన్నర్ కాగలడని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.

Update: 2021-03-09 13:25 GMT

రిషభ్ పంత్ (ఫొటో హన్స్ ఇండియా)

Rishabh Pant: రిషభ్ పంత్ టీ 20 ఫార్మాట్‌లో భారత్‌కు మ్యాచ్ విన్నర్ కాగలడని, రాబోయే టీ 20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఈమేరకు స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్‌ ప్రోగ్రాంలో వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడాడు.

'పంత్ టెస్టుల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సిడ్నీ, బ్రిస్బేన్‌లలో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించడంతోపాటు అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టెస్టులో కీలక పాత్ర పోషించాడు. టీం లో పంత్ ఉండడం చాలా ముఖ్యం. ఒకటి లేదా రెండు ఇన్నింగ్స్ ద్వారా పంత్ పై తీర్పు ఇవ్వకూడదని" స్టైలిష్ బ్యాట్స్ మెన్ అన్నారు. అలాగే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని అవకాశాలు ఇవ్వాలని కోరాడు. నాల్గవ టెస్టులో భారత్ 365 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించిన పంత్.. 118 బంతుల్లో 101 పరుగులు చేశాడు. జనవరిలో ఆస్ట్రేలియా టూర్‌ లో భాగంగా సిడ్నీలో 97 పరుగులు, బ్రిస్బేన్‌లో 89 పరుగులతో అజేయంగా నిలిచాడు.

మార్చి 12 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ 20 ఇంటర్నేషనల్ క్రికెట్ సిరీస్‌లో భారత్ ఇంగ్లండ్‌తో తలపడనుంది. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాతో పాటు పంత్ టీం ఇండియా ఫినిషర్ పాత్రను ఖచ్చితంగా నెరవేర్చగలడని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. అలాగే టీ20లకు ఎంపికైన ముంబై బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌ను కూడా లక్ష్మణ్ ప్రశంసించారు. "అతను దీనికి అర్హుడు, సూర్యకుమార్ యువతకు, ముఖ్యంగా భారతదేశంలో గొప్ప రోల్ మోడల్ అని నేను భావిస్తున్నాను" అని లక్ష్మణ్ అన్నారు. ప్లేయింగ్ ఎలెవన్ లో ఆడతాడో లేదో తెలియదు.. కానీ అతను ఖచ్చితంగా టీ 20 జట్టులో చోటు దక్కించుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు.

Tags:    

Similar News