IPL 2024 Playoffs: ఆర్‌సీబీకి ఇంకా చాన్స్ ఉందా, టాప్-4 లోకి జట్టు వెళ్లగలదా?

IPL 2024 Playoffs: ఇండియన్ ప్రీమియర్ (ఐపీఎల్) పాయింట్స్ టేబుల్‌లో నిన్న మొన్నటివరకూ అట్టడుగున ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)పై సోషల్ మీడియాలో మీమ్స్, జోక్స్‌కు కొదవేలేదు.

Update: 2024-05-06 12:11 GMT

IPL 2024 Playoffs: ఆర్‌సీబీకి ఇంకా చాన్స్ ఉందా, టాప్-4 లోకి జట్టు వెళ్లగలదా?

IPL 2024 Playoffs: ఇండియన్ ప్రీమియర్ (ఐపీఎల్) పాయింట్స్ టేబుల్‌లో నిన్న మొన్నటివరకూ అట్టడుగున ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)పై సోషల్ మీడియాలో మీమ్స్, జోక్స్‌కు కొదవేలేదు.

ఐపీఎల్ కప్పును సొంతంగా ప్లాస్టిక్‌తో ఎలా చేయించుకోవాలి? అనే వీడియోను అర్ధరాత్రి విరాట్ కోహ్లీ చూస్తున్నట్లు కనిపించే వీడియో ఈ మధ్య చాలా వైరల్ అయింది.

మొన్నటికిమొన్న సూపర్ హిట్ అయిన జాక్వెలీన్ ఫెర్నాండేజ్ సాంగ్ ‘యిమ్మీ యిమ్మీ’కి సోషల్ మీడియాలో దరిద్రంగా డాన్స్‌వేస్తూ వీడియోలు చేసేవారినీ ఆర్‌సీబీ అభిమానులంటూ ట్రోల్ చేశారు.

అసలు ఈ సీజన్‌కు కూడా ఆర్‌సీబీ జాతకం ఇంతేనా? ప్లేఆఫ్స్‌ వరకైనా జట్టు చేరుకుంటుందా? టాప్‌-4లోకి వెళ్లేందుకు ఇప్పుడు జట్టు చేయాల్సిందేమిటి?

లీగ్ దశ చివరకు

ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ స్టేజ్ చివరకు వచ్చేసింది. ప్లేఆఫ్స్‌కు చేరుకునేందుకు ప్రస్తుతం పది జట్లలోని ముంబయి ఇండియన్స్ మినహా తొమ్మిది జట్లు ఇంకా రేసులోనే ఉన్నాయి. అంటే ఆర్‌సీబీకి కూడా ఇంకా అవకాశముందా?

దీనికి సమాధానం ఉందనే చెప్పాలి. కానీ, ఆ ఉంది వెనుక చాలా కష్టం కూడా దాగుంది. ఈ కష్టం ఆర్‌సీబీ ఒక్కటే పడితే చాలదు. మిగతా టీమ్‌లను కూడా కష్టకాలం వెంటాడాలి.

అంటే ఆర్‌సీబీ తర్వాత వచ్చే మ్యాచ్‌లను గెలవడంతోపాటు ప్రత్యర్థి జట్లు ఓడిపోవాలి. అప్పుడే ఆర్‌సీబీ అభిమానుల ఆశ గట్టెక్కుతుంది.

ఎన్ని గెలవాలి?

ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కావాలంటే కనీసం 16 పాయింట్లు ఉండాలి. ఈ లీగ్‌లో ఒకసారి మాత్రమే 14 పాయింట్లతో ఒక జట్టు క్వాలిఫై అయింది.

ప్రస్తుతం కలకత్తా నైట్ రైడర్స్ 16 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది. మిగిలిన మూడ్ లీగ్ మ్యాచ్‌లలో ఆ జట్టు ఒక మ్యాచ్ గెలిచినా ప్లేఆఫ్స్‌కు వచ్చేస్తుంది. అసలేమీ గెలవకపోయినా ప్లేఆఫ్స్‌కు వచ్చే అవకాశం కూడా ఉంది.

ఆ తర్వాతి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉంది. నిజానికి ఈ జట్టుకు కూడా 16 పాయింట్లు ఉన్నాయి. అయితే రన్ రేట్‌లో కలకత్తా కంటే కాస్త వెనుకపడటంతో ఈ జట్టు రెండో స్థానంలో ఉంది. జట్టు కూడా లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో ఒకటి గెలిచినా చాలు. ప్లేఆఫ్స్‌కు జట్టు వచ్చేస్తుంది.

చెన్నై సూపర్‌ కింగ్స్ (12), సన్ రైజర్స్ హైదరాబాద్ (12), లఖ్‌నవూ సూపర్ జైంట్స్ (12), దిల్లీ క్యాపిటల్స్ (10) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్లేఆఫ్స్‌కు చేరుకునేందుకు ఈ జట్లు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది.

ఆర్‌సీబీ పరిస్థితి ఏమిటి?

నిన్న మొన్నటివరకు ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ప్రదర్శన అత్యంత పేలవంగా ఉండేది. బ్యాటర్‌లు అప్పుడప్పుడైనా రన్లు కొడుతుంటే, బౌలర్లు మాత్రం చేతులెత్తేసేవారు.

అయితే, గత మూడు మ్యాచ్‌లలో ఆర్‌సీబీ విజృంభించింది. ముఖ్యంగా జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటన్స్‌పై జరిగిన మ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, కామెరాన్ గ్రీన్ స్టార్‌ పెర్ఫార్మర్లుగా నిలిచారు.

ఈ మ్యాచ్‌తో ఆర్‌సీబీ పాయింట్లు ఎనిమిదికి పెరిగాయి. ఇప్పటివరకూ ఆడిన 11 మ్యాచ్‌లలో ఆ జట్టు నాలుగింటిని గెలిచింది.

ఆర్‌సీబీ ఇంకా ఎన్ని గెలవాలి?

ప్రస్తుతం లీగ్ దశలో మరో మూడు మ్యాచ్‌లు ఆర్‌సీబీకి మిగిలాయి. ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఈ మూడింటినీ తప్పకుండా ఆర్‌సీబీ గెలవాల్సి ఉంటుంది. అప్పుడు జట్టు పాయింట్లు 14కు పెరుగుతాయి.

అయితే, వాస్తవానికి ఈ 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం తక్కువే. అయితే, చిన్న అవకాశం మాత్రం ఉంటుంది.

అదేమిటంటే, ఇకపై జరగనున్న లీగ్ మ్యాచ్‌లలో చెన్నై సూపర్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జైంట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలవకూడదు.

అలానే దిల్లీ క్యాపిటల్స్ కూడా రెండు కంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలవకూడదు.

ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మిగతా ప్రత్యర్థి జట్ల కంటే ఆర్‌సీబీ రన్‌రేట్ మెరుగ్గా ఉండాలి. అంటే తాము గెలవబోయే మూడు మ్యాచ్‌లు భారీ మార్జిన్‌తో జట్టు గెలవాల్సి ఉంటుంది.

అంటే అవకాశం ఉన్నప్పటికీ, ఆర్‌సీబీ మాత్రం ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం దాదాపుగా అసాధ్యమే.

ఇదేమీ కొత్త కాదుగా..

ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్స్‌లో 2009, 2011, 20116లలో మాత్రమే ఆర్‌సీబీ ఫైనల్స్‌కు చేరుకుంది.

2008, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2023 సీజన్లలో అయితే, లీగ్ స్టేజీలోనే జట్టు కథ ముగిసింది.

మొదటి ఐపీఎల్‌ను 2008లోనే ఆర్‌సీబీ ఆడింది. కానీ, 16 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా కప్పును గెలవలేకపోయింది. ప్రస్తుత సీజన్‌లో కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఆర్‌సీబీ పేలవ ప్రదర్శనకు జట్టులో మంచి బౌలర్లు లేకపోవడమే కారణమని, పైగా తప్పుల నుంచి ఆర్‌సీబీ పాఠాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి బౌలర్లే కాదు, ప్రస్తుత సీజన్‌లో టాప్ బ్యాటర్లు కూడా ఒత్తిడికి లోనవుతూ కనిపించారు.

మొత్తానికి అభిమానుల ఆశలపై ఈ సీజన్‌లోనూ ఆర్‌సీబీ నీళ్లు చల్లేస్తోంది.

Tags:    

Similar News