Asia Cup 2025: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు? గ్యారెంటీ ఇవ్వలేమన్న ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు
Asia Cup 2025: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మ్యాచ్ భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే పోరు.
Asia Cup 2025: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మ్యాచ్ భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే పోరు. ఈ రెండు జట్లు తలపడితే టీవీ రేటింగ్లు, స్టేడియంలో సందడి మామూలుగా ఉండవు. అయితే, 2025 ఆసియా కప్లో ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే దానిపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రారంభం కానుంది. ఇందులో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నమెంట్లో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అయితే, ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత క్రికెట్ అభిమానులు, పాకిస్థాన్తో మ్యాచ్ ఆడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కారణంగా, ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లో కూడా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగలేదు. పాకిస్థాన్తో ఆడటానికి భారత జట్టు నిరాకరించడంతో టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. దీంతో, ఆసియా కప్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందేమోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సీఈవో సుభాన్ అహ్మద్ మాట్లాడుతూ.. "ఆసియా కప్లో రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే, దీనిపై ఎలాంటి గ్యారెంటీ ఇవ్వలేము" అని అన్నారు.
అయితే, ఆయన ఒక ముఖ్యమైన విషయాన్ని వివరించారు. WCL అనేది ఒక ప్రైవేట్ టోర్నమెంట్. కానీ, ఆసియా కప్ అనేది ఒక అంతర్జాతీయ టోర్నమెంట్. ఆసియా కప్లో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు, ప్రభుత్వ అనుమతిని ముందుగానే తీసుకుంటారు. కాబట్టి, WCL లో లాంటి పరిస్థితి ఆసియా కప్లో రాదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆసియా కప్ 2025 షెడ్యూల్
వేదిక: యూఏఈ
తేదీ: సెప్టెంబర్ 9, 2025 నుంచి
ఫార్మాట్: టీ20 (2026 టీ20 ప్రపంచకప్కు సన్నాహకంగా)
భారత తొలి మ్యాచ్: సెప్టెంబర్ 10న యూఏఈతో
భారత్ vs పాక్: సెప్టెంబర్ 14న
గ్రూపులు:
గ్రూప్ ఎ: భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్
గ్రూప్ బి: శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్
ఒకవేళ రెండు జట్లు సూపర్ ఫోర్, ఫైనల్స్కు చేరితే, ఈ టోర్నమెంట్లో భారత్, పాకిస్థాన్ మూడుసార్లు తలపడే అవకాశం ఉంది.