T20 World Cup 2021: నేటి నుంచే ఐసీసీ టీ-20 వరల్డ్ కప్

*నేటి నుంచి నవంబరు 14 వరకు మెగా టోర్నీ *మొత్తం 16 జట్లతో ఐసీసీ ఈవెంట్ *యూఏఈ వేదికగా ధనాధన్ టోర్నీ

Update: 2021-10-17 01:40 GMT

నేటి నుంచే ఐసీసీ టీ-20 వరల్డ్ కప్(ఫైల్ ఫోటో) 

ICC T20 World Cup: ఇండియన్ గ్రేట్ లీగ్ ఐపీఎల్ అలా ముగిసిందో లేదో క్రికెట్ ఫ్యాన్స్‌ కిక్ ఇచ్చేందుకు మరో మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. యూఏఈ వేదికగా ఇవాల్టి నుంచే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. నేటి నుంచి నవంబర్ 14 వరకూ జరగనున్న ఈ టోర్నీలో ఇవాళ ఆరంభ మ్యాచ్‌ జరగనుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో ఒమన్, పాపువా న్యూగినియా జట్లు తలపడనున్నాయి. అలాగే, రాత్రి ఏడున్నర గంటలకు జరిగే మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి.

ఇక ఈ ఏడాది మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు తలపడుతున్నాయి. తొలుత 8 చిన్న జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో శ్రీలంక, నెదర్లాండ్స్, ఐర్లాండ్, నమీబియా గ్రూప్-బిలో బంగ్లాదేశ్, ఒమన్, స్కాట్కాండ్, పాపువా న్యూ గినియా జట్లు ఉన్నాయి. దీని అనంతరం సూపర్-12 స్టేజ్ ప్రారంభమవుతుంది. గ్రూప్-ఏ, గ్రూప్-బి నుంచి టాప్‌లో నిలిచిన నాలుగు జట్లు సూపర్-12 దశకు అర్హత సాధిస్తాయి. ఇదే సమయంలో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, వెస్టిండీస్ వంటి జట్లు నేరుగా సూపర్-12 దశ నుంచి ఈ టోర్నీలో తమ ప్రస్థానాన్ని మొదలు పెడతాయి.

మరోవైపు సూపర్-12 దశలోని గ్రూప్-1లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా వాటితోపాటు గ్రూప్-ఏలో తొలిస్థానం సాధించిన జట్టు, గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు కూడా పోటీపడతాయి. ఇక గ్రూప్-2లో భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉండగా వాటితో పాటు గ్రూప్-బిలో ప్రథమస్థానం సాధించిన జట్టు, గ్రూప్-ఏలో ద్వితీయ స్థానం సాధించిన జట్టు తలపడనున్నాయి. ఇక సూపర్-12 నుంచి టాప్‌లో నిలిచిన 4 జట్లు సెమీఫైనల్స్‌లో అడుగుపెడతాయి. ఇదిలా ఉంటే తొలి సెమీఫైనల్ నవంబరు 10న, రెండో సెమీఫైనల్ నవంబరు 11న జరగనుండగా విశ్వ విజేతను నిర్ణయించే ఫైనల్ మ్యాచ్ నవంబరు 14న జరగనుంది.

Tags:    

Similar News