స్వర్ణాల సిక్సర్ కొట్టిన హిమదాస్
హిమాదాస్ స్వర్ణ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఐరోపా అథ్లెటిక్స్ పోటీల్లో ఆమె వరుసగా ఆరో స్వర్ణం సాధించింది.
హిమాదాస్ స్వర్ణ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఐరోపా అథ్లెటిక్స్ పోటీల్లో ఆమె వరుసగా ఆరో స్వర్ణం సాధించింది. చెక్ రిపబ్లిక్ లో జరిగిన అథ్లెటిక్ మిటింక్ రీటెర్ ఈవెంట్ 300 మీటర్ల పరుగు పందెంలో పసిడి పతకాన్ని కైవసం చేసుకుని స్వర్ణాల సిక్సర్ కొట్టింది. కేవలం 18 రోజుల వ్యవధిలో ఐదు స్వర్ణాలు తన ఖాతాలో వేసుకున్న హిమ ఇప్పుడు ఆరో బంగారుపతకాన్ని ఒడిసి పట్టుకుంది.
జూన్ 2న ప్రారంభమైన హిమదాస్ జోరు కొనసాగుతోంది. 200 మీటర్ల విభాగంలో నాలుగు పసిడి పతకాలు గెలిచిన ఆమె.. 400 మీ పరుగులో ఒక స్వర్ణం, 300 పరుగులో మరో పసిడి గెలిచింది. ఇదే క్రమంలో 400 మీ పరుగులో సీజన్ ఉత్తమ టైమింగ్ (52.09 సె) కూడా నమోదు చేసింది.
ఇక ఇదే టోర్నీ పురుషుల 300 మీ పరుగులో మహ్మద్ అనాస్ పసిడి పతకం గెలుచుకున్నాడు. అతను 32.41 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. అనాస్ 400 మీ పరుగులో ఇప్పటికే సెప్టెంబర్లో దోహాలో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్కు అర్హత సాధించాడు. ఈ విభాగంలో జాతీయ రికార్డు అతని ఖాతాలో ఉంది.