భారత మహిళల హాకీ జట్టుకు మూడు పసిడి పతకాలు సాధించిన అర్జున అవార్డు గ్రహీత సూరజ్ లతా దేవి ఇప్పుడు వరకట్న బాధితురాలైంది. తనపై భర్త వరకట్న వేధింపులకు పాల్పడుతున్నాడని ఈ జాతీయ మాజీ కెప్టెన్ గువహటి పోలీసులను ఆశ్రయించింది. 2005లో సూరజ్ లతా దేవి వివాహం శాంతకుమార్ తో జరిగిందని... అప్పటినుంచి అధిక కట్నం కోసం చిత్రహింసలకు గురిచేస్తున్నాడని వాపోయింది. తాను దక్కించుకున్న పతకాలను చూపిస్తూ వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అంటూ ఎగతాళి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.
అర్జున అవార్డు కూడా ఏదో అనైతిక కార్యకలాపాల వల్ల వచ్చిందంటూ దారుణంగా మాట్లాడుతున్నాడని తన ఫిర్యాదులో వెల్లడించింది. సూరజ్ లతా దేవి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. షారుఖ్ ఖాన్ హీరోగా అమ్మాయిల హాకీ నేపథ్యంలో వచ్చిన చిత్రం చక్ దే ఇండియా సినిమాకు సూరజ్ లతా దేవిని స్ఫూర్తిగా తీసుకుని నిర్మించారు. ఆమె జీవితంలోని అనేక ఘట్టాల ఆధారంగానే ఈ చిత్ర కథకు రూపకల్పన చేశారు.