టీమిండియా మాజీ సెలక్టర్ వీబీ చంద్రశేఖర్ (57) ఆత్మహత్య
భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ సెలక్టర్ వీబీ చంద్రశేఖర్ (57) ఆత్మహత్య చేసుకున్నారు. వ్యాపారంలో నష్టాలే ఇందుకు కారణంగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ సెలక్టర్ వీబీ చంద్రశేఖర్ (57) ఆత్మహత్య చేసుకున్నారు. వ్యాపారంలో నష్టాలే ఇందుకు కారణంగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
గురువారం సాయంత్రం తన గదిలోకి వెళ్లిన చంద్రశేఖర్ ఎంతకీ బయటకు రాకపోవడంతో అయన భార్యకు అనుమానం వచ్చింది. తలుపు కొట్టి పిల్చి చూసినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫోన్ చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు తలుపులు కొట్టి చూడగా ఆయన ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించినట్టు దర్యాప్తు అధికారి మురుగన్ చెప్పారు.
వీబీ గా ప్రసిద్ధి..
క్రికెట్ వర్గాల్లో చంద్రశేఖర్ వీబీగా ప్రసిద్ధి చెందారు. తమిళనాడు క్రికెట్ కి అయన మూలస్తంభంగా నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్ లో అయన తక్కువగానే ఆడినప్పటికీ, దేశీయ క్రికెట్ లో ఆయనకు మంచి పేరు వుంది. అప్పట్లో ఇరానీ కప్లో రెస్టాఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్లో 56 బంతుల్లో సెంచరీ సాధించి సంచలనం సృష్టించారు. ఆయన 81 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 43.09 సగటుతో 4,999 పరుగులు సాధించారు.
అయితే, భారత జట్టు తరఫున అయన చాలా తక్కువగా ఆడారు. కేవలం ఏడు వన్డేలే ఆడిన ఆయన 88 పరుగులే చేశారు. ఇందులో అయన అత్యధిక స్కోరు 53 పరుగులు కూడా ఉన్నాయి. టీమిండియా మేనేజర్ గా గ్రెగ్ చాపెల్ ఉన్న కాలంలో ఆయన జాతీయ జట్టు సెలక్టర్ గా పనిచేశారు.
క్రికెట్ వ్యాపారం..
వీబీ మొదట్నుంచీ క్రికెట్ నే నమ్ముకున్నారు. దానినే తన ఆదాయ వనరుగా ఎంచుకుని జీవితాన్ని నడిపించారు. ఐపీఎల్ లానే తమిళనాడులో ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తారు. దానిలో వీబీ కంచి వీరన్స్ అనే జట్టుకు ఆయనే యజమాని. అంతే కాకుండా వీబీస్ నెస్ట్ అనే క్రికెట్ అకాడమీ కూడా ఆయనకు ఉంది. ఇటీవల ప్రీమియర్ లీగ్ జట్టులో నష్టాలు బాధించాయి. దీంతో అయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.