BCCI : విరాట్, రోహిత్ వన్డే రిటైర్మెంట్.. మరో ఆలోచనలో బీసీసీఐ
భారత క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రిటైర్మెంట్పై గత కొద్దిరోజులుగా ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
BCCI : విరాట్, రోహిత్ వన్డే రిటైర్మెంట్.. మరో ఆలోచనలో బీసీసీఐ
BCCI : భారత క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రిటైర్మెంట్పై గత కొద్దిరోజులుగా ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వన్డే ఫార్మాట్లో కూడా వారి కెరీర్ ముగియనుందని, అక్టోబర్లో ఆస్ట్రేలియా పర్యటనతో వీరి ప్రయాణం ఆగిపోతుందని ఒక రిపోర్ట్లో పేర్కొన్నారు. అయితే, ఈ వార్తలపై బీసీసీఐ స్పందించినట్లు పీటీఐ నివేదిక వెల్లడించింది. ఈ వార్తల్లో నిజం లేదని బీసీసీఐ దృష్టి వేరే విషయంపై ఉందని పేర్కొంది.
బీసీసీఐ ప్రస్తుతం విరాట్, రోహిత్లను వన్డే ఫార్మాట్ నుంచి పంపించే ఆలోచనలో లేదు. ప్రస్తుతం బోర్డు దృష్టి మొత్తం రాబోయే ఆసియా కప్ టీ20 2025పైనే ఉంది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరిగే ఈ టోర్నమెంట్, వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్కు ఒక కీలక సన్నాహకంగా భావిస్తున్నారు. అందుకే, ప్రస్తుతం ఈ టోర్నమెంట్ పైనే దృష్టి పెట్టిన బీసీసీఐ, రోహిత్, విరాట్ల వన్డే భవిష్యత్తు గురించి తొందరపడటం లేదని నివేదికలో పేర్కొన్నారు.
విరాట్, రోహిత్ల గురించి బీసీసీఐ వర్గాలు చాలా స్పష్టంగా ఉన్నట్లు పీటీఐ నివేదిక చెబుతోంది. ఒకవేళ ఆ ఇద్దరు ఆటగాళ్లు వన్డే క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవ్వాలని అనుకుంటే, వారు స్వచ్ఛందంగానే ఆ విషయాన్ని బోర్డుకు తెలియజేస్తారని అంటున్నారు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే ముందు కూడా, ఇంగ్లాండ్ పర్యటనకు జట్టును ఎంపిక చేయడానికి ముందే వారు బీసీసీఐ అధికారులతో మాట్లాడి తమ నిర్ణయాన్ని తెలియజేశారు. కాబట్టి, వన్డేల విషయంలో కూడా వారే నిర్ణయం తీసుకుంటారని బోర్డు వర్గాలు నమ్ముతున్నాయి.
ఇదివరకటి రిపోర్ట్లో వచ్చిన కొన్ని ఊహాగానాలకు తాజా నివేదిక చెక్ పెట్టింది. అక్టోబర్ 25న సిడ్నీలో విరాట్, రోహిత్లకు వీడ్కోలు మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ ఏ రకమైన చర్చలు జరపలేదని స్పష్టంగా పేర్కొన్నారు. వన్డే క్రికెట్లో కొనసాగాలంటే రోహిత్, విరాట్లు దేశవాళీ టోర్నమెంట్ అయిన విజయ్ హజారే ట్రోఫీ ఆడాల్సి ఉంటుందని వచ్చిన వార్తలను కూడా పీటీఐ రిపోర్ట్ తోసిపుచ్చింది. డిసెంబర్ 24 నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. అయితే, ఈ టోర్నమెంట్ ప్రారంభమయ్యే లోపే టీమిండియా ఆరు వన్డే మ్యాచ్లు ఆడి ఉంటుంది. అలాగే, విజయ్ హజారే ట్రోఫీ ముగిసేలోపే భారత్-న్యూజిలాండ్ మధ్య జనవరిలో మూడు వన్డే మ్యాచ్లు కూడా ఉంటాయి. కాబట్టి, ఈ దశలో వారిని విజయ్ హజారే ఆడాలని కోరడం అసంభవమని పీటీఐ పేర్కొంది.