విద్యుత్ దీపాల సొబగుల్లో తిరుమల
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వేగంగా సిద్ధమవుతోంది తిరుమల. ప్రస్తుతం తిరుమల ఎటు చూసినా వెలుగులతో మెరిసిపోతోంది. విద్యుత్ దీపాల చూడచక్కని అమరిక భక్తులను అలరిస్తోంది. విద్యుత్ దీపాలతొ తిరుమలలో అడుగడుగూ కొత్త శోభను సంతరించుకుంది.
టీటీడీ చేసిన విద్యుత్ అలంకరణల ఏర్పాట్లతో తిరుమల క్షేత్రం కళకళలాడుతోంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి ఆలయంతో పాటు తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్ నుంచి మాడవీధుల వరకు ఏర్పాటు చేసిన విద్యుత్వెలుగులతో కొండ కనువిందు చేస్తోంది. ఆలయ మహాగోపురంతో పాటు ప్రాకారం, ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక విద్యుత్ అలంకరణలు చేస్తున్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశారు. పార్కులు, వాటర్ ఫౌంటెన్లు విద్యుత్ కాంతుల్లో ప్రత్యేక అందాలు సంతరించుకున్నాయి. ప్రధాన కూడళ్ళలో భారీ కటౌట్లు, సప్తద్వారాలు, రోడ్లకు ఇరువైపుల ఎల్ఈడీ విద్యుత్దీపాలంకరణలు ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. సంబంధిత సిబ్బంది అలంకరణల నాణ్యతను గత మూడు రోజులుగా పరిశీలిస్తూ, గుర్తించిన లోటుపాట్లను సవరిస్తున్నారు. మరో రెండురోజుల్లో ఆలయ ప్రాకారం, గోపురం, లోపలి భాగాల్లోని విద్యుత్ అలంకరణ పనులు కూడా పూర్తిచేయనున్నారు.