బెజవాడ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు మంగళవారం అమ్మవారు గాయత్రీ దేవి అలంకారంలో తన కటాక్షాన్ని అందిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం (ఆశ్వయుజ శుద్ధ తదియ) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ గాయత్రీదేవిగా సాక్షాత్కరిస్తుంది. వేదమాతగా ప్రసిద్ధి పొందిన ఈ తల్లి ... ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది. పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత అయిన గాయత్రీదేవిని పూజిస్తే సకల ఉపద్రవాలూ తొలగుతాయనీ, బుద్ధి తేజోవంతం అవుతుందని భక్తుల నమ్మకం. ఈ రోజున వంగ, ఆకుపచ్చ, బంగారు వన్నెల చీరల్లో కొలుదీరిన అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, కేసరి, పులగాలను సమర్పిస్తారు.
ఈరోజు అలంకారం.. గాయత్రీదేవి విశిష్టత..
సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది.
ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది.గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేదం పారాయణ ఫలితాన్ని ఇస్తుంది.