భారత స్టాక్ మార్కెట్ పతనం, ఇండియాలో పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య, తొలి మరణం ధ్రువీకరణ కావడం, వంటి అంశాలపై చర్చించేందుకు కేంద్ర క్యాబినెట్ అత్యవసరంగా సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న మంత్రులందరినీ ఢిల్లీకి రావాలని ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి సమాచారం వెళ్ళింది. ఈ ఉదయం 11 గంటలకు మోదీ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాల తోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
కరోనా వ్యాధి అనుమానితులు సంచరించిన ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మోదీ మంత్రులతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాగా భారత్లో తొలి కరోనా మరణం నమోదైన సంగతి తెలిసిందే. బుధవారం కర్ణాటకలోని కల్బుర్గిలో చనిపోయిన 76 ఏళ్ల వృద్ధుడు మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ.. కరోనా వైరస్తో చనిపోయినట్లు నిర్ధారించారు వైద్యులు. కరోనా లక్షణాలతో సౌదీ నుంచి వచ్చిన ఈ వృద్ధుడు ఇటీవల ఓ ఆసుపత్రిలో చేరారు. అతడి నమూనాలను వైద్య పరీక్షల కోసం.. పుణెకు పంపగా .. రిపోర్ట్లో పాజిటివ్ అని తేలింది.