మందుపాతర పేల్చిన మావోలు.. ఇద్దరు జవాన్ల మృతి
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బస్తర్ జిల్లాలో శనివారం మందుపాతర పేల్చారు.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బస్తర్ జిల్లాలో శనివారం మందుపాతర పేల్చారు. ఈ దారుణానికి ఇద్దరు జవాన్లు మృతి చెందగా మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. రాయ్పూర్కు దక్షిణాన 330 కిలోమీటర్ల దూరంలో జగ్దల్పూర్ జిల్లాలోని బోడ్లీ సమీపంలో మావోయిస్టులు భారీ పేలుడు పరికరం(ఐఇడి) ని అమర్చారు. దాంతో ఛత్తీస్గడ్ (సిఎఎఫ్) దళాల ఇద్దరు సిబ్బంది మరణించారు మరియు మరొకరు తీవ్రంగా గాయపడ్డారని బస్తర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సుందర్రాజ్ తెలిపారు. ధౌడై-బార్సూర్ మార్గంలో మాలేవాహి మరియు బోడిలి మధ్య రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న తరుణంలో భద్రతా రక్షణ కల్పించడానికి సిఎఎఫ్, సిఆర్పిఎఫ్ మరియు జిల్లా పోలీసు బలగాలతో కూడిన సంయుక్త బృందం ఆపరేషన్లో ఉంది.
కాగా మృతులు ఉపేందర్ సాహూ, దేవేందర్ సాహూగా గుర్తించారు. తీవ్ర గాయాల పాలైన మరో జవాన్ ఎస్ఎం రెహమాన్ ను ప్రత్యేక హెలికాప్టర్లో రాయ్పూర్కు తరలించి వైద్య సేవలనందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఇక మందుపాతర పేల్చిన అనంతరం మావోయిస్టులు, పోలీసులకు మధ్య 15 నిమిషాల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు.
ఈ ప్రాంతానికి ఉపబలాలను తరలించామని, కూంబింగ్ ఆపరేషన్ మరింత ముమ్మరం చేసిందని పోలీసులు తెలిపారు. ఘటనకు పాల్పడిన నక్సల్స్ సమీపంలోని అడవుల్లోకి పారిపోయారని వారిని ఎలాగైనా పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.