Rahul Gandhi: అమేఠీలో రాహుల్ అభ్యర్థిత్వంపై కొనసాగుతున్న ఉత్కంఠ
Rahul Gandhi: కాంగ్రెస్ తరపున రాహులే అభ్యర్థంటూ కథనాలు
Rahul Gandhi: ఉత్తర్ప్రదేశ్లో కాంగ్రెస్కు ఒకప్పటి కంచుకోటైన అమేధీలో మరోసారి రాహుల్ గాంధీ పోటీ చేస్తారా? లేదా? అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రాహుల్ ఇప్పటికే బరిలో ఉన్న కేరళలోని వయనాడ్లో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. అది ముగిశాకే అమేథీ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది. అమేథీలో నామినేషన్ల దాఖలుకు మే 3 వరకు గడువు ఉన్నందున.. ఈ అంశంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు అమేథీలో పోటీ అంశంపై ప్రకటన వెలువడితే వయనాడ్ లో వ్యతిరేక ప్రచారం మొదలవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. వయనాడ్ లో గెలుపే వ్యూహంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోంది. ఈ సమయంలో వేరే చోట పోటీ చేస్తున్నారని ప్రకటించడం మంచిది కాదని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు.
ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట.. అక్కడ పాగా వేయడం ద్వారా కాంగ్రెస్ కు ఎంతో అవసరం. అక్కడ రాహుల్ గాంధీ పోటీ చేయడం ద్వారా యూపీలో మరిన్ని సీట్లపై ఆ ప్రభావం ఉంటుందనేది స్థానిక కాంగ్రెస్ నేతల భావన. మరోవైపు అమేధీ రాజీవ్ గాంధీ సొంత నియోజక వర్గం కావడం విశేషం. అమేథీతో సోనియా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. అయితే అమేథీపై బీజేపీ పట్టుపెంచుకున్న నేపథ్యంలో దాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రాహుల్ గాంధీ పోటీ చేయడమే సరైన మార్గంగా భావిస్తోంది. పోటీ చేయడమే కాకుండా.. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాలని కూడా కాంగ్రెస్ థింక్ ట్యాంక్ కోరుతోంది.