వలస కూలీల అవస్థలపై 'సుప్రీం' విచారణ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

Update: 2020-05-26 16:23 GMT

కరోనా వైరస్‌తో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కూలీలు కాలినడకన, సైకిళ్లపైన వందల కి.మీలు మేర ప్రయాణం చేయడంపై వివిధ పత్రికలు, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుప్రీంకోర్టు సుయోటగా తీసుకుంది. వలస కూలీలకు తక్షణమే ఉచితంగా తగిన రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు ఆహారం, వసతి ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లే క్రమంలో వారు పడిన అవస్థలపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా అంశాన్ని సుమోటోగా తీసుకొని న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వలస కూలీల కష్టాలపై తమకు కొన్ని లేఖలు వచ్చాయని పేర్కొంది. సమాజంలో పలు వర్గాల ప్రజల నుంచి వినతిపత్రాలు వచ్చాయని ధర్మాసనం తెలిపింది. వారు ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో వారికి ఎక్కడా ఆహారం, మంచినీళ్లు కూడా ప్రభుత్వాలు కల్పించలేదని ఫిర్యాదులు అందాయని తెలిపింది.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అవి లోపభూయిష్టంగా ఉన్నాయంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను మే 28కి వాయిదా వేసింది.


Tags:    

Similar News