Stampede at Kumbh Mela: మహా కుంభమేళాలో అపశ్రుతి చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం దగ్గర భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 15 మంది మరణించినట్లు సమాచారం. ఈ మేరకు ఘటనాస్థలంలో ఓ వైద్యుడు చెప్పినట్లు జాతీయ మీడియా తెలిపింది. మరణించినవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించారు.
కుంభమేళా తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరా తీశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు తక్షణ సాయం అందించాలని ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారు.క్షతగాత్రులు జాతర ఆవరణలో నిర్మించిన సెంట్రల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన కొందరిని ప్రయాగ్రాజ్లోని స్వరూప రాణి నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, భక్తులు పుకార్లను పట్టించుకోవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.