దేశవ్యాప్తంగా విస్తారంగా వానలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ సీజన్లోనే మొత్తం 75 శాతం వర్షాలు కురుస్తాయి. సాధారణ వర్షపాతం కురిసేందుకు 102 శాతం అవకాశాలు ఉన్నాయని కేంద్ర భూశాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం.రాజీవన్, ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.
జూన్ నుంచి సెప్టెంబరు వరకు సాగే ఈ సీజన్లో 75 శాతం వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తర భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువగా, దక్షిణ భారతదేశంలో సాధారణంగా, తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.
మరోవైపు, అరేబియా సముద్రంలో ముంబైకి 690 కిలోమీటర్ల దూరంలో నిన్న మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. ఇది నేడు తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ తుపాను ఈశాన్య దిశగా పయనించి మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా హరిహరేశ్వర్-దమణ్ల మధ్య తీరాన్ని తాకుతుందని చెప్పారు. పసిఫిక్ మహాసముద్రంలో బలహీనమైన లానినా పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని, ఇది మంచి సంకేతమని చెప్పారు.
అరేబియా సముద్రంలో ముంబయికి 690 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఏర్పడిందని, తీవ్రరూపం దాల్చి తుపాను రూపాంతరం చెందనుందని రాజీవన్, మహాపాత్ర తెలిపారు. 'నిసర్గ' అని పేరు పెట్టనున్నారు.
గంటకు 105-110 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీనివల్ల మహారాష్ట్ర, గుజరాత్ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సోమవారం పంజాబ్, హరియాణా, ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి.
ముందు జాగ్రత్త చర్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షించారు. ఇప్పటికే సీఎంలతో మాట్లాడిన అమిత్ షా, రెండు తెలుగు రాష్ట్రాలకు 31 బృందాల జాతీయ విపత్తు స్పందన దళాలను పంపించారు.
HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి