దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రోహిణీ కార్తె రావడంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఒకవైపు కరోనాతో ప్రజలు విలవిలాడుతుంటే. మరోవైపు లాక్ డౌన్ తో ఇళ్లలో ఉన్న ప్రజలు ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
అయితే సూర్యతాపంతో ఇబ్బంది పడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ విభాగం (IMD) చల్లని కబురు అందించింది. జూన్ 1వ తేదీ తర్వాత నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించేదుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. మే 31వ తేదీ నుంచి నుంచి జూన్ 4వ తేదీ వరకు ఆగ్నేయం, పక్కనే ఉన్న తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో కేరళలో నైరుతి రుతుపవనాల ప్రారంభానికి జూన్ 1 నుంచి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు మాల్దీవ్స్-కోమరిన్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకు, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, అండమాన్, నికోబార్ దీవులను తాకుతాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.