దేశద్రోహం కేసు ప్రజలకు తెలిసేలా విచారణ చేయాలి : కన్హయ్య కుమార్
దేశ ద్రోహ కేసుకు సంబంధించి మాజీ జెఎన్యుఎస్యు అధ్యక్షుడు, సిపిఐ నాయకుడు కన్హయ్య కుమార్తో పాటు మరో 9 మందిపై విచారణ జరిపేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
దేశ ద్రోహ కేసుకు సంబంధించి మాజీ జెఎన్యుఎస్యు అధ్యక్షుడు, సిపిఐ నాయకుడు కన్హయ్య కుమార్తో పాటు మరో 9 మందిపై విచారణ జరిపేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెఎన్యు దేశద్రోహ కేసులో నిందితుడైన కన్హయ్య కుమార్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో దేశద్రోహ చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలకు తెలిసేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరితగతిన విచారణ చేయాలని కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు.
సిపిఐ అభ్యర్థిగా బెగుసారై సీటు నుంచి 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి బిజెపికి చెందిన గిరిరాజ్ సింగ్ చేతిలో ఓడిపోయానని.. ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న సమయంలో తనపై ఉద్దేశపూర్వకంగా చార్జిషీట్ దాఖలు చేశారని ఆరోపించారు. "నేను ఎన్నికల్లో పోటీ చేయబోతున్నప్పుడు మొదటిసారి చార్జిషీట్ దాఖలైంది, ఇప్పుడు మళ్ళీ బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి.
బీహార్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ) ప్రభుత్వం ఉంది, జాతీయ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి), నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పిఆర్) కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది "అని రాంచీలో విలేకరుల సమావేశంలో కన్హయ్య పేర్కొన్నారు. తనతో పాటు ఈ కేసులో ఉన్న మరో ఇద్దరిని విచారించాలని ఢిల్లీ ప్రభుత్వం నగర పోలీసులకు శుక్రవారం సమాచారం ఇచ్చిన తరువాత అతను ఈ ప్రకటన చేశారు.
ఈ కేసులో కుమార్పై విచారణ జరిపేందుకు త్వరితగతిన క్లియరెన్స్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు ఢిల్లీహోం కార్యదర్శికి బుధవారం లేఖ రాశారు. లేఖలో "ఐపిసి యొక్క VI వ అధ్యాయం సెక్షన్ 196 సిఆర్పిసి కింద ప్రాసిక్యూషన్ మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని స్పెషల్ సెల్ డిప్యూటీ కమిషనర్ ప్రమోద్ కుష్వా అభ్యర్థించారు. కాగా కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలపై విచారణ జరిపేందుకు ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం అనుమతి ఇచ్చింది. వీరిమీద జెఎన్యు క్యాంపస్లో టెర్రరిస్ట్ అఫ్జల్ గురుకు అనుకూల నినాదాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.