సాగు చట్టాలతో దేశంలో ఒక్కరైతు నష్టపోలేదు : ప్రధాని

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్‌సభలో మాట్లాడారు.

Update: 2021-02-10 14:17 GMT

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ పలు కీలక అంశాలను ప్రస్థావించారు. కొత్త సాగు చట్టాల ఆవశ్యకతను, వ్యవసాయ చట్టాల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రధాని మోడీ వివరించారు. కానీ విపక్షాలు మోడీ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాయి.

సాగు చట్టాలతో దేశంలో ఎక్కడైనా వ్యవసాయ మార్కెట్లు మూతపడ్డాయా అని ప్రధాని మోడీ అన్నారు. ఏ రైతుకైనా మద్దతుధర లభించలేదా అని మోడీ లోక్‌సభలో ప్రశ్నించారు. సాగు చట్టాల వల్ల ఒక్క రైతుకు కూడా నష్టం జరగలేదని ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చారు. కానీ కొందరు కావాలానే రాజకీయం చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు.

కాలం చెల్లిన చట్టాలతో దేశం ముందుకెళ్లడం కష్టమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దేశాభివృద్ధి కోసం చట్టాల సవరణలు, కొత్త చట్టాలను తీసుకురావాల్సిన అవసరముందని మోడీ అన్నారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభలో ఒకలా.. లోక్‌సభలో మరోలా ప్రవర్తిస్తుందని ప్రధాని ఎద్దెవా చేశారు.

కరోనా మహహ్మారి నేపథ్యంలో ప్రపంచానికి భారత్‌ ఓ ఆశాకిరణంలా మారిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచ దేశాల్లో మనదేశానికి ప్రాధాన్యత పెరిగిందన్నారు. మనదేశం వైవిద్యానికి మారుపేరు. అలాంటి వైవిధ్యంలోనే మనం ఏకతాటిపైకి వచ్చి కరోనాను జయించామని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచమంతా బాగుండాలని కోరుకునే దేశం భారతదేశమని ప్రధాని సగ్వరంగా చాటిచెప్పారు.

ప్రపంచంలో గొప్ప శక్తిగా అవతరించేందుకు భారత్‌ కృషి చేస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ఆ దిశగా పయనించేందుకు ఆత్మనిర్భర్ భారత్‌ నినాదం తీసుకొచ్చామని మోడీ గుర్తుచేశారు. ఫార్మా రంగంలో మనం ఇప్పటికే ఆత్మనిర్భర్ సాధించామని మోడీ చెప్పుకచ్చారు.

Tags:    

Similar News