మేఘాలయ, నాగాలాండ్లో పోలింగ్ ప్రారంభం
*ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
మేఘాలయ, నాగాలాండ్లో పోలింగ్ ప్రారంభం
Polling in Nagaland and Meghalaya: ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు రాష్ట్రాల్లో 60 శాసనసభ స్థానాలు ఉండగా.. రెండు రాష్ట్రాల్లో 59 స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. నాగాలాండ్లో ఇప్పటికే ఒక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రెండు రాష్ట్రాల్లో 59 స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి.
రెండు రాష్ట్రాల్లో 552 మంది బరిలో ఉన్నారు. 34 లక్షలకు పైగా ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. మేఘాలయాలో ఇప్పటి దాకా ఏ పార్టీకి పూర్తి మెజార్టీ దక్కలేదు. కాగా నాగాలాండ్లో ఏ పార్టీ అన్నిచోట్లా పోటీకి దిగలేకపోయింది.. మేఘాలయలో అన్ని పార్టీల నుంచి 369 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 36 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 21 లక్షల మంది ఓటర్ల కోసం 3 వేల 419 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. రాష్ట్రంలో అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది.
మరోవైపు నాగాలాండ్లో మొత్తం 183 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారి కోసం 2 వేల 291 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, బీజేపీ పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిలిచాయి. కాంగ్రెస్, NPP, NCP, JDUల నుంచి వాటికి గట్టి పోటీ ఎదురవుతోంది.