పాకిస్థాన్ ప్రచారకర్తలా మోడి వ్యవహరిస్తున్నారు
ప్రధాని మోడిపై మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు ఎన్ఆర్సీ విషయంలో ప్రజలను... బిజెపి నేతలు అయోమయానికి గురిచేస్తున్నారు
పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ ప్రధాని మోడిపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో మమతా బెనర్జీ పాల్గొని మాట్లాడారు. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయిన తర్వాత కూడా భారతీయులు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ ప్రభుత్వం కోరడం సిగ్గుచేటన్నారు. భారత్ విలువైన సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమన్నారు.
భారత్ను పదే పదే పాకిస్థాన్తో ఎందుకు పోలుస్తున్నారని ప్రధాని మోడిని మమతా బెనర్జీ ప్రశ్నించారు. భారత ప్రధానిలా కాకుండా పాకిస్థాన్ ప్రచారకర్తలా మోడి వ్యవహరిస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు . ఎన్ఆర్సీ విషయంలో ప్రజలను బిజెపి నేతలు అయోమయానికి గురిచేస్తున్నారని మమతా బెనర్జీ దుయ్యబట్టారు.