పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ దారితప్పింది. ఆమె ప్రయాణించాల్సిన రూట్ కాకుండా వేరే మార్గం గుండా హెలికాఫ్టర్ వెళ్ళింది. దాంతో పార్టీ శ్రేణుల తోపాటు అధికారులు కలవరపాటుకు గురయ్యారు. బుధవారం ఉత్తర దీనాజ్పూర్ జిల్లా చోప్రా జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కోసం మమతా బెనర్జీ.. మధ్యాహ్నం 1.05 గంటలకు సిలిగురి నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరారు. అయితే షెడ్యూల్ ప్రకారం 1.27 గంటలకు ఆమె అక్కడికి చేరుకోవాల్సి ఉంది.
దారి తప్పిన దీదీ హెలికాఫ్టర్
అయితే సమయం 1:50 గంటలవుతున్నా చాపర్ అక్కడికి చేరుకోలేదు. దీంతో జిల్లా అధికారుల్లో టెన్షన్ మొదలయింది. ఏమైందా అని ఆరా తీసే లోగా దీదీ హెలికాఫ్టర్ గాల్లో చక్కర్లు కొట్టింది. హెలికాఫ్టర్ పైలట్ సభాస్థలిని గుర్తించకపోవడంతో.. వారు బిహార్లోకి ప్రవేశించారు. వెంటనే పైలట్తో సంప్రదింపులు జరిపిన అధికారులు హెలికాఫ్టర్ సభాస్థలికి చేరుకునేలా డైరక్షన్స్ ఇచ్చారు. దీంతో 2 గంటల ప్రాంతంలో హెలికాఫ్టర్ ల్యాండ్ అయింది.