భర్త మరణించిన దుఃఖంలో ఉంటే.. వేధింపులతో ప్రాణం తీసిన ఖాకీ!

Shivamogga: విధి ఆడిన వింత నాటకంలో ఒకే కుటుంబానికి చెందిన దంపతులు వారం వ్యవధిలోనే తనువు చాలించారు.

Update: 2026-02-23 09:34 GMT

భర్త మరణించిన దుఃఖంలో ఉంటే.. వేధింపులతో ప్రాణం తీసిన ఖాకీ!

Shivamogga: విధి ఆడిన వింత నాటకంలో ఒకే కుటుంబానికి చెందిన దంపతులు వారం వ్యవధిలోనే తనువు చాలించారు. భర్త మరణించిన దుఃఖంలో ఉన్న భార్యను, ఒక పోలీసు అధికారి వేధించడంతో ఆమె కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన కర్ణాటకలోని భద్రావతి నగరంలో వెలుగుచూసింది.

హోస సిద్ధాపుర నివాసి, పోలీసు శాఖలో డీ-గ్రేడ్ ఉద్యోగి అయిన జగదీష్.. శివరాత్రి పర్వదినాన తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై న్యూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగానే, శుక్రవారం సాయంత్రం అతని భార్య స్వాతి (26) కూడా అదే ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. వారం వ్యవధిలోనే తల్లిదండ్రులు ఇద్దరూ మరణించడంతో వారిద్దరు చిన్నారి కుమార్తెలు అనాథలుగా మారారు.

చనిపోవడానికి ముందు స్వాతి తన తల్లికి పంపిన వాట్సాప్ సందేశం ఇప్పుడు సంచలనంగా మారింది. తీర్థహళ్లి తాలూకా మలూరు స్టేషన్‌కు చెందిన ఒక పోలీసు అధికారి తనను తీవ్రంగా వేధిస్తున్నాడని ఆమె ఆ సందేశంలో వాపోయింది. "నీ భర్త మరణానికి నువ్వే కారణం" అంటూ సదరు అధికారి తనపై ఒత్తిడి తెచ్చాడని, రకరకాలుగా భయపెట్టాడని ఆమె పేర్కొంది.

తన కుమార్తె మృతికి కారణమైన సదరు పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్వాతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళను ఓదార్చాల్సింది పోయి, ఆమె మరణానికి కారణమైన అధికారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా పోలీసు యంత్రాంగం అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

Tags:    

Similar News