కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో 13మంది మరణించారు. తుంకూరు జిల్లా కొణిగల్ తాళూకా బెంగళూరు- మంగళూరు హైవేపై గురువారం రాత్రి 12.30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. అనంతరం వారు ఘటన వివరాలను వెల్లడించారు.
గురువారం రాత్రి బెంగళూరు నుంచి ధర్మస్థలం వెళుతున్న బ్రీజా కారు ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం పల్టీ కొట్టి, ఎదురుగా ధర్మస్థలం నుంచి బెంగళూరు వెళుతున్న చెవర్లైట్ కారును ఢీకొట్టిందని చెప్పారు. ప్రమాదం కారణంగా బ్రీజా కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు, చెవర్లైట్లో ప్రయాణిస్తున్న 10మంది అక్కడికక్కడే మరణించారని చెప్పారు. వన్వే రోడ్డు కావటంతో అతివేగం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.