ఓ వైపు డెడ్లైన్లు.. మరోవైపు పిటిషన్లు.. ఇంకోవైపు ట్విస్టులు, మధ్యలో కొత్తగా చేతబడులు.. ఇలా కర్ణాటకం కంటిన్యూ అవుతూనే ఉంది. నిన్న సీఎం కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాసపరీక్షపై చర్చ.. ఇవాళ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు గవర్నర్ గడువులు విధిస్తున్నా.. చర్చ మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. తాజాగా గవర్నర్ వాజూభాయ్ వాలా.. ఈ సాయంత్రం 6 గంటల్లోగా బలపరీక్ష నిర్వహించాలని సీఎం కుమారస్వామికి మరో లేఖ రాశారు. అయితే గడువు ముగిసినా.. చర్చ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక సాయంత్రానికి ఎటూ తేల్చుకోవడానికి సమయమం లేదంటూ శాసన సభను సోమవారానికి వాయిదా వేశారు.
ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాల్లోగా బలపరీక్ష పూర్తి చేయాలని.. లేఖ రాశారు. అయితే స్పీకర్ రమేశ్ కుమార్ దాన్ని పట్టించుకోలేదు. తర్వాత 6 గంటల్లోపు బలపరీక్ష నిర్వహించి.. సీఎం తన ఆధిక్యాన్ని నిరూపించుకోవాలని మరో లేఖ రాశారు. అయితే దీన్ని కూడా ఖాతరు చేయలేదు. ఈ సందర్భంగా గవర్నర్ వరుసగా లవ్ లెటర్లు రాస్తున్నారంటూ.. సీఎం కుమారస్వామి ఎద్దేవా చేశారు.
మరోవైపు అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో.. కర్ణాటకం మరోసారి సుప్రీం మెట్లెక్కింది. విప్పై స్పష్టత కోరుతూ.. ఆ రాష్ట్ర పీపీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు.. సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. అంతలోనే.. సీఎం కుమారస్వామి కూడా సుప్రీంను ఆశ్రయించారు. శాసనసభ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యంపై ముఖ్యమంత్రి పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఓవైపు బలపరీక్షపై చర్చ జరుగుతుండగానే.. బలం నిరూపించుకోవాలంటూ గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని.. అది అసెంబ్లీ ప్రొసీడింగ్స్కు విరుద్ధమని.. పిటిషన్లో పేర్కొన్నారు.
మరోవైపు అధికార విపక్షాలు ఎవరి వ్యూహాల్లో వారున్నారు. ప్రతిపక్ష బీజేపీ త్వరగా బలపరీక్ష నిర్వహించేందుకు పట్టుపడుతోంది. గవర్నర్ ద్వారా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఆయన బలపరీక్షను నిర్ణీత గడువులోగా నిర్వహించాలని.. రెండు సార్లు లేఖలు రాశారు. అటు అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తైతే గానీ.. బలపరీక్ష నిర్వహించే అవకాశం లేకపోవడంతో.. కావాలనే కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విశ్వాసపరీక్షపై సభ్యులంతా మాట్లాడేందుకు స్పీకర్ అనుమతివ్వడంతో.. ఈ చర్చ ముగియాలంటూ మరో రెండు మూడు రోజులకు పైగానే సమయం పడుతుందని.. చెబుతున్నారు. మరోవైపు ఎన్నిరోజులైనా సరే చర్చ కొనసాగించాలని, సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పించాలని సీఎల్పీ నేత సిద్ధరామయ్య అన్నారు. అందరి అభిప్రాయాలు వెలిబుచ్చిన తర్వాతే విశ్వాస పరీక్ష జరపాలని సూచించారు.
ఒకానొక సమయంలో సభలో సభ్యులు నివాదాలు చేస్తూ.. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. రెబల్స్పై తక్షణం చర్యలు తీసుకోవాలని.. బలనిరూపణకు ఓటింగ్ నిర్వహించాలని.. డిమాండ్ చేస్తూ బీజేపీ సభ్యులు స్పీకర్ను డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అయితే జరుగుతున్న పరిణామాలపై స్పీకర్ రమేశ్ కుమార్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. తాను నిప్పుల కుంపటిపై కూర్చున్నట్టుగా ఉందని.. గౌరవంతో బతికే తనను కించపరిచే విధంగా కొంత మంది మాట్లాడుతున్నారని అన్నారు. అసెంబ్లీలో సభ్యులు మాట్లాడే ప్రతి మాట రికార్డవుతుందని హెచ్చరించారు. హడావుడిగా నిర్ణయాలు తీసుకోబోనన్న స్పీకర్.. చర్చ తర్వాతే.. బలపరీక్ష ఉంటుందన్నారు.