కూత పెట్టనున్న రైళ్ళు.. రిజర్వేషన్ ఉంటేనే ప్రయాణం!
దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి రైళ్ళను నడపడానికి రైల్వే శాఖ సిద్ధం అవుతోంది. ఈ మేరకు తొలి విడతలో 200 రైళ్ళను వివిధ మార్గాల్లో పునఃప్రారంభించడానికి సన్నాహాలు చేసింది.
లాక్ డౌన్ నేపధ్యంలో రైళ్ళను నిలిపివేశారు. ఇటీవల వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్ళను నడిపిన రైల్వే శాఖ.. కొన్ని రూట్లలో సాధారణ ప్రజల కోసం కూడా కొన్ని రైళ్ళను నడిపింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి రైళ్ళను నడపడానికి సిద్ధం అవుతోంది. ఈ మేరకు తొలి విడతలో 200 రైళ్ళను వివిధ మార్గాల్లో పునఃప్రారంభించడానికి సన్నాహాలు చేసింది.
దీనికి సంబంధించి ఆయా రైళ్ళ జోన్లు..రూట్లు..ప్రయాణ సమయాలు.. అన్నిటినీ వివరిస్తూ అన్ని జోన్ల అధికారులకూ సమాచారం అందించింది. ఈ రైళ్లకు ఈరోజు అంటే మే 21 నుంచే రిజర్వేషన్ కల్పించాలని భావిస్తున్నారు. ఇక రైళ్ళు తిరిగే రూట్లు.. రైళ్ళ వివరాలు ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం ఇలా ఉన్నాయి..
- ముంబయి-హైదరాబాద్ హుస్సేన్సాగర్ ఎక్స్ప్రెస్ (02701/02),
- హౌరా- సికింద్రాబాద్ ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (02703/04),
- హైదరాబాద్- న్యూదిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్ (02723/24),
- దానాపూర్- సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్ (02791/92),
- విశాఖపట్నం- దిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ (02805/06),
- గుంటూరు- సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్ (07201/02) ,
- తిరుపతి- నిజామాబాద్ రాయలసీమ ఎక్స్ప్రెస్ (02793/94),
- హైదరాబాద్- విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్ (02727/28).
వీటితో పాటు వారానికి రెండుసార్లు నడిచే సికింద్రాబాద్- హజ్రత్ నిజాముద్దీన్ (02285/86) దూరంతో, హౌరా-యశ్వంత్పూర్ (వయా విజయవాడ) దురంతో ఎక్స్ప్రెస్ (02245/46)లు కూడా ఉన్నాయి. అంతే కాకుండా, ముంబయి సీఎస్టీ- భువనేశ్వర్ (వయా సికింద్రాబాద్, విజయవాడ) కోణార్క్ ఎక్స్ప్రెస్ (01019/20) ను కూడా ప్రతిరోజూ తిప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అన్నీ రిజర్వుడే..
ఈ రైళ్లలో జనరల్ బోగీలుగా ఏమీ ఉండవు. మామూలు బోగీల్లోనూ టికెట్లను ముందుగా తీసుకోవాల్సిందే. రిజర్వేషన్ తీసుకున్న వారికి మాత్రమె అనుమతి ఉంటుంది. రిజర్వేషన్ కౌంటర్లు..రైల్వే స్టేషన్లలో టికెట్లు ఇవ్వరు. కేవలం రైల్వే అధికారిక ఐఆర్సీటీసీ వెబ్ లేదా యాప్ ద్వారానే టికెట్ ఇస్తారు. 30 రోజుల ముందుగా రిజర్వేషన్ కు అవకాశం ఉంటుంది. అదేవిధంగా వెయిటింగ్..ఆర్ఏసీ టికెట్లను కూడా జారీ చేస్తారు.