లాక్ డౌన్ పేరేత్తితే అందరికీ కళ్ళ వెంబడీ నీళ్లు తెప్పించే అంశం... వలస కార్మికుల జీవనం చిద్రమైన దుస్థితి.... ఎక్కడో వందల, వేల మైళ్ల దూరలో పనులు చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న వలస కార్మికుల బతుకుల్లో లాక్ డౌన్ నిప్పులు పోసిందనే చెప్పాలి. ఒకేసారి ప్రకటించిన లాక్ డౌన్ నేపథ్యంలో జీవనోపాధి లేక తిండికి సైతం ఇబ్బందులు పడుతూ పదులు, వందలు కాదు ఏకంగా వేల మైళ్లు నడుచూ కుంటూ ఇంటి దారి పట్టారు. ఇలాంటి వారిలో ఇంటికి చేరిన ఎందరో... మధ్యలోనే అసువులు బాసిన వారు మరెందరో... అయితే అప్పట్నుంచి ఇప్పటివరకు పనులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వీరికి వారి స్వంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించేందుకు కేంద్రం యోచిస్తోంది. దీనికి అవసరమైన మార్గదర్శకాలు రూపొందించేందుకు ఒక ప్రత్యేక కమిటీని వేసింది. కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత వారందరకీ జీవనోపాధి కల్పించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే దీనిని దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తే ప్రయోజనం ఉంటుందని పలువురు కోరుతున్నారు.
కరోనా, లాక్డౌన్ వలస కార్మికులను ఇంటిబాట పట్టేలా చేసింది. దాదాపుగా మూడు నెలల నుంచి వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలు, కార్మికులు సొంతూళ్లకు మళ్లుతున్నారు. దేశాలు, రాష్ట్రాలు దాటిని వెళ్లిన వారిని కూడా ప్రభుత్వం ప్రత్యేక విమానాలు, జలమార్గాల ద్వారా స్వస్థలాలకు చేరుస్తోంది. ఇన్నాళ్లుగా పలు నగరాలు, పట్టణాల్లో ఉపాధి పొందిన వారు పనిలేక, చేతిలో డబ్బులేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇటువంటి తరుణంలో కేంద్రం ఇప్పుడు వలస కూలీలు, కార్మికులపై ప్రత్యేక దృష్టి సారించింది. అందరికీ ఉపాధి కల్పించే దిశగా కసరత్తు చేస్తోంది.
వలస కార్మికులకు పని కల్పించే దిశగా మోదీ సర్కార్ చర్యలు ప్రారంభించింది. దేశంలోకి వలస వచ్చిన వారి వివరాలను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ మేరకు కేంద్రం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో ప్రత్యేక కమిటీ వేసినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో కమిటీ నివేదిక అందజేయనుంది. సొంత గ్రామాలకు వచ్చిన వలస కూలీలు, కార్మికుల నైపుణ్యం ఆధారంగా పని కల్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల సాయం కూడా తీసుకోనుంది.
116 జిల్లాల్లో వలస కార్మికులు ఉన్నారని గుర్తించింది. ఆ జిల్లాల్లో కూలీలకు ఉపాధి కల్పించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో బీహార్లో అత్యధికంగా 32 జిల్లాల నుంచి వలసలు ఉండగా, ఉత్తరప్రదేశ్ లో 31 జిల్లాలు, మధ్యప్రదేశ్ లో 24, రాజస్థాన్ లో 22, ఒడిషాలో 4, జార్ఞండ్ లో 3 జిల్లాలు ఉన్నట్లుగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ గుర్తించింది.