ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల జాబితాలో భారత్ మూడోస్థానంలో నిలిచింది. ఈ మేరకు హురున్ గ్లోబల్ రిచ్ 2020 జాబితా వెల్లడించింది. ఈ జాబితాలో చైనా మరియు యుఎస్ తరువాత భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో నిలిచింది. నివేదిక ప్రకారం, 2019 లో భారతదేశం ప్రతి నెలా 3 బిలియనీర్లను తయారు చేయడంతో ఆ ఏడాది మొత్తం సంఖ్య 34 కు చేరింది. ఈ జాబితాలో మొత్తం 169 మంది భారతీయ బిలియనీర్లు ఉన్నారు, వారిలో 32 మంది భారతదేశం వెలుపల ఉన్నారు. ఇందులో భారత్ నుంచి చూస్తే ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ర్టీస్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచినట్టు ఆ జాబితా పేర్కొంది. ప్రస్తుతం ముకేశ్ అంబానీ ఆస్తుల నికర విలువ 6,700 కోట్ల డాలర్లు(సుమార రూ.4.8లక్షల కోట్లు). ఆయన ఆదాయం గంటకు రూ. 7 కోట్ల చొప్పున ఉన్నట్టు లెక్క తేల్చారు. ఇక ప్రపంచ కుబేరుల జాబితాలో కూడా ముకేశ్ అంబానీ తొమ్మిదో స్థానం సంపాదించారు.
ప్రపంచ బిలియనీర్లలో 14,000 కోట్ల డాలర్లతో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో నిలిచారు. అంబానీ తరువాత భారత్ నుంచి ఎస్పీ హిందుజా కుటుంబం (2,700 కోట్ల డాలర్లు) రెండో స్థానంలో, గౌతమ్ అదానీ (1,700 కోట్ల డాలర్లకు పైగా) మూడో స్థానంలో, hcl అధినేత శివ్ నాడార్ ఆయన కుటుంబం ( దాదాపు 1,700 కోట్ల డాలర్లు) 4వ స్థానంలో ఉన్నారు. ఇక లక్ష్మీ మిట్టల్ (1,500 కోట్ల డాలర్లు) ఐదో స్థానంలో నిలిచారు. ఇక ఓయో వ్యవస్థాపకుడు 24 ఏళ్ల వయసున్న రితేష్ అగర్వాల్ సంపద 110 కోట్ల డాలర్లుగా నమోదైంది. ఈయన దేశంలోనే అతి పిన్న వయసు సంపన్నుడు చెప్పుకోదగ్గ విషయం. ఇదిలావుంటే ఓ వైపు దేశంలో ఆర్థిక మందగమనం సాగుతున్నప్పటికీ శ్రీమంతుల సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం. ఇన్ఫోసిస్కు చెందిన ఎన్ఆర్ నారాయణ మూర్తి కూడా 2.3 బిలియన్ డాలర్లతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.