Hetero generic COVID-19 drug: తెలంగాణకు చేరిన కరోనా మందు.. తొలివిడత ఐదు రాష్ట్రాలకే
COVID-19 drug Covifor: కరోనా వైరస్ చికిత్సలో వినియోగించనున్న మెడిసిన్ ‘కొవిఫర్’ను తొలివిడతగా ఐదు రాష్ట్రాలకు అందచేశారు.
కరోనా వైరస్ చికిత్సలో వినియోగించనున్న మెడిసిన్ 'కొవిఫర్' ను తొలివిడతగా ఐదు రాష్ట్రాలకు అందచేశారు. వీటిలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నా మహారాష్ట్ర, ఢిల్లీ సహా గుజరాత్, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి. రెండో విడత మందును కోల్కతా, ఇండోర్, భోపాల్, లఖ్నవూ, విజయవాడ, కోచి, పట్నా, భువనేశ్వర్, రాంచి, తిరువనంతపురం, గోవా నగరాలకు పంపిణీ చేయనుంది.
కాగా.. అమెరికాకు చెందిన గిలిద్ సైన్సెస్ అభివృద్ధి చేసిన 'రెమ్డెసివర్'కు జనరిక్ తయారుచేసి, పంపిణీ చేసేందుకు హైదరాబాద్ కు చెందిన హెటిరో ల్యాబ్స్కు అనుమతి లభించిన విషయం తెలిసిందే. తొలివిడతగా హెటిరో 20వేల వయల్స్ను ఆయా రాష్ట్రాలకు అందచేసింది. మరో మూడు వారాల్లో లక్ష వయల్స్ తయారు చేయాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కొవిఫర్ పంపిణీ ప్రభుత్వం, ఆస్పత్రుల ద్వారా మాత్రమే జరుగుతుందని, మార్కెట్లో కొనుగోలు చేసేందుకు లభించదని హెటిరో వివరించింది. అత్యవసర స్థితిలో ఉన్న రోగులకు మాత్రమే కొవిఫర్ను అందించనున్నారని తెలిపింది.
కరోనా సోకిన వ్యక్తికి కనీసం ఆరు మోతాదులు అవసరమని.. 100 మిల్లీగ్రాముల మోతాదు 5,400 రూపాయలని ఆ సంస్థ వెల్లడించింది. దేశంలో అత్యధిక కేసులు ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, యుపీలలో ఉన్నాయి. కరోనా బారిన పడిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. సుమారు 4.74 లక్షల కేసులు, 14,894 మరణాలు నమోదయ్యాయి.