Madhya Pradesh: భారీ వర్షాలతో మధ్యప్రదేశ్ అతలాకుతలం
Madhya Pradesh: భారీ వరదలతో జలదిగ్భందంలో 1,250 గ్రామాలు * వరదల్లో చిక్కుకున్న 6వేల మందికి పైగా జనం
మధ్యప్రదేశ్ లో భారీ వరదలు (ఫైల్ ఇమేజ్)
Madhya Pradesh: భారీ వర్షాలతో మధ్యప్రదేశ్ అతలాకుతలమవుతోంది. వందలాది గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకుని బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి అనూహ్యంగా చిక్కుకున్నారు. దీంతో ఆయనను సహాయక సిబ్బంది రక్షించి.. అక్కడ నుంచి వాయు సేన హెలికాప్టర్లో సురక్షితంగా తరలించారు.
మరోవైపు.. మొత్తం 12 వందల 50 గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. దీంతో ఆర్మీ సహా ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ దళాలు సహాయ చర్యల్లో పాల్గొని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇప్పటి వరకూ 6వేల మందికిపైగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ముఖ్యమంత్రి చౌహాన్ తెలిపారు. పలుచోట్ల మరో రెండు వేల మంది వరద నీటిలో చిక్కుకున్నారని, వాళ్లను రక్షించేందుకు సహాయ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని పేర్కొన్నారు. దాతియా జిల్లాలో వరదల ధాటికి రెండు వంతెనలు కుప్పకూలిపోగా, మరో బ్రిడ్జి తీవ్రంగా దెబ్బతిన్నట్టు సీఎం చౌహాన్ వెల్లడించారు. ఇక.. మధ్యప్రదేశ్ వరద బీభత్సంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది.