ఉత్తరప్రదేశ్లోని ఫరుఖాబాద్ జిల్లాలో కరుడుగట్టిన నేరస్థుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఫరుఖాబాద్ జిల్లాలో 23 మంది చిన్నారులను బందీలుగా చేసుకొని కలకలం సృష్టించిన వ్యక్తిని పోలీసులు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కాల్చి చంపారు. అనంతరం పిల్లలందర్ని పోలీసులు ఆ ఇంటి నుంచి సురక్షితంగా బయటకుతీసుకొచ్చారు.
సుభాష్ బాథమ్ అనే వ్యక్తి గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. తన కుమార్తె బర్త్డే వేడుకల పేరుతో చుట్టుపక్కల ఇళ్ల నుంచి 23 మంది చిన్నారులను ఆహ్వానించాడు. అనంతరం వారందర్నీ ఇంట్లో బంధించాడు. పిల్లలు ఇంకా ఇంటికి రావడం లేదని వెళ్లిన తల్లిదండ్రులపైకి అతడు ఆయుధాలతో కాల్పులు జరిపాడు. ఆందోళన చెందిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బందీలను వదిలిపెట్టి లొంగిపోవాలంటూ గ్యాంగస్టర్ను హెచ్చరించారు. అయితే, పోలీసుల మాటను లెక్కచేయని ఆ రౌడీ హ్యాండ్ గ్రెనేడ్ను ఖాకీలపైకి విసిరాడు. దాంతో, పోలీసులు మరిన్ని బలగాలను స్పాట్కి రప్పించారు. ముందుజాగ్రత్తగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ను రంగంలోకి దించారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించి ఉన్మాదిని మట్టుబెట్టారు. ఈ విషయం ఉత్కంఠకు గురిచేయడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం స్వయంగా పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ ఘటన నుంచి చిన్నారుల క్షేమంగా బయటపడడంతో వారి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.